రాములమ్మ సినిమాలోని రామిరెడ్డిలో కేసీఆర్: విజయశాంతి, 'దుబాయ్ పంపే బ్రోకర్ పనులు చేశాడు'
గద్వాల: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒసేయ్ రాములమ్మ సినిమాలో రామిరెడ్డిలా ఆయన స్థానంలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నారని విజయశాంతి దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం ఐసీయూలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్ వేరు, ఇప్పుడు ఉన్న కేసీఆర్ వేరు అని చెప్పారు. సమైక్యవాదులతో కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ వచ్చింది ఎస్సీ, ఎస్టీలకు కాదు దొరలకే అన్నారు.
తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం నాలుగేళ్లుగా మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలతో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి తనను ముఖ్యమంత్రిని చేస్తే తెరాసను విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని, ఆయన విజ్ఞప్తికి సోనియాగాంధీ ఒప్పుకోలేదని చెప్పారు.
తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నాలుగున్నర ఏళ్లకే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారని, వారి నుంచి డబ్బులు తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నారు.
బ్రోకర్ పనులు చేశాడు: ఉత్తమ్
తాను యుక్త వయస్సులో దేశ రక్షణ కోసం పని చేసానని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాత్రం దుబాయ్ పంపే బ్రోకర్ పనులు చేశారని విమర్శించారు. మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులు తెలంగాణ కోసం ఏం చేశారని వారిని మంత్రులుగా కూర్చోబెట్టారని ప్రశ్నించారు. తెలంగాణకు కేసిఆర్ నెంబర్ వన్ ద్రోహి అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చేయలేదన్నారు.