కేసీఆర్! మీ జాతకాలు తారుమారుకాక తప్పదు: విజయశాంతి సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్లో ఆత్మవిశ్వాసం మితిమీరిపోయిందని, అందుకే ప్రజలకు ఏమీ చేయకపోయినా.. వచ్చే పదేళ్లు తానే సీఎం కొనసాగుతానని అంటున్నారని మండిపడ్డారు.
కొందరు జ్యోతిష్కులు చెప్పిన విషయాన్ని కేసీఆర్ తలకెక్కించుకున్నట్లు ఉందని ఆమె అన్నారు. అయితే, ప్రజలు తలచుకుంటే ఎలాంటి జాతకాలన్నయినా తారుమారు చేయగలరన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిదని విజయశాంతి హితవు పలికారు.
తెలంగాణ కోసం పోరాడిన ఓయూ విద్యార్థులను దూరం పెట్టిన విధంగానే.. ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి ఉద్యమించిన ప్రభుత్వ ఉద్యోగులను సైతం అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ది దొర అహంకారమని, ఆయన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని విజశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజావ్యతిరేక, అవినీతి పాలన జరుగుతోందని ఆరోపించారు.