సీఎం అయ్యాక కళ్లు నెత్తికెక్కాయి, కేసీఆర్ నీ జాతకమిదే: విజయశాంతి, ఖుష్బూ తీవ్రవ్యాఖ్యలు
వరంగల్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి తరఫున ప్రముఖ సినీ తారలు, ఆ పార్టీ నాయకులు విజయశాంతి, ఖుష్బూ, నగ్మాలు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విజయశాంతి సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు.
గెలిచే పార్టీ పేరు చెప్పలేదేం?: తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే, కిషన్రెడ్డి ఆగ్రహం
కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి
సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో రాములమ్మ రోడ్డు షోలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్కు ఉన్న జాతకాల పిచ్చితోనే ముందస్తు ఎన్నికలు వచ్చాయని విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాక్షసుల పాలన అంతమై కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కళ్లు నెత్తికి ఎక్కాయన్నారు.
కేసీఆర్కు రాములమ్మ చెబుతున్న జాతకం ఇదే
కేసీఆర్ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసం చేశారని విజయశాంతి విమర్శించారు. అమరవీరుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పారు. సోనియా గాంధీ వల్ల తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. అమరుల పునాదులపై కూర్చొని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ గద్దె దిగడం ఖాయమని చెప్పారు. కేసీఆర్కు రాములమ్మ చెబుతోన్న జాతకం ఇదేనని అన్నారు.
తలరాత మారబోతుంది
తెలంగాణ తలరాత మారబోతోందని, నాడు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు ఏమిటి, ఇప్పుడు చేసిన మోసం ఏమిటని కేసీఆర్ పైన విజయశాంతి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని తెరాసను గద్దె దింపాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలో సెంటిమెంట్, అధికారంలోకి వచ్చాక సెటిల్మెంట్, తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులకు మంత్రివర్గంలో ప్లేస్మెంట్, ఇదేమిటని అడిగితే తమకు పనిష్మెంట్ అన్నారు.
ఏ పథకమూ ఆగిపోదు
మళ్లీ తెరాసకు ఓటేస్తే ప్రజల జీవితాలు నాశనం అవుతాయని విజయశాంతి చెప్పారు. ఫలితాలు విడుదలయ్యే డిసెంబర్ 11వ తేదీ నుంచి తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆమె కూటమి అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ పథకమూ ఆగిపోదన్నారు.
కేసీఆర్పై ఖుష్బూ తీవ్ర వ్యాఖ్యలు
వరంగల్ జిల్లాలో ఖుష్బూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెరాస పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. కేసీఆర్ హయాంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మాత్రమే భరోసా ఉందని ఆరోపించారు. సీఎం అంటే తెరాస హయాంలో కమీషన్ మ్యాన్గా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆ పదాన్ని అలా మార్చేశారన్నారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు.