వాళ్ళతో పెట్టుకున్న ఏ సర్కార్ బతికి బట్టకట్టినట్టు చరిత్రలో లేదు: విజయశాంతి హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా బిజెపి నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఎంతో కాలంగా వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకున్న దాఖలాలు లేవని, మరోమారు విజయశాంతి వీఆర్ఏల సమస్యను తెరమీదకు తీసుకువచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, ఇప్పటివరకు వారిని చర్చించడం కోసం కూడా పిలవలేదని పేర్కొన్న విజయశాంతి సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కార్ వీఆర్ఏల జీవితాలతో ఆడుకుంటుంది అంటూ విజయశాంతి తనదైన శైలిలో మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వారి సమ్యసలను పరిష్కరిస్తామని చెప్పి టిఆర్ఎస్ సర్కార్ చేతులు దులుపుకుందని విజయశాంతి పేర్కొన్నారు. ఇప్పటివరకు కనీసం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. వారు ఇప్పుడు ఏం చేయాలో తెలీక అయోమయంతో జీవితాలను నెట్టుకొస్తున్నారని ప్రస్తుతం వీఆర్ఏల పరిస్థితిని విజయశాంతి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.
మునుగోడు ఎన్నిక జరిగి వారాలు గడుస్తున్నా కూడా కేసీఆర్ సర్కార్ నుంచి ఉలుకు పలుకు లేదని విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. వీఆర్ఏలు 83 రోజుల పాటు సమ్మె చేశారని పేర్కొన్న విజయశాంతి, ఉప ఎన్నిక కోసం వీఆర్ఏ లను చల్లబరచారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ఉండడంతో కేసీఆర్ సర్కార్ వీఆర్ఏలపై కంత్రి డ్రామాకు తెరదీసిందని పేర్కొన్న విజయశాంతి సీఎం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఏం కేసీఆర్ నీకు కాసంతనైన దయలేదా..? అమాయకులైన వీఆర్ఏల జీవితాలతో ఇంకెన్ని రోజులు ఆడుకుంటావు అంటూ విజయశాంతి నిలదీశారు. కేసీఆర్.. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ సర్కార్ కూడా బతికి బట్ట కట్టినట్లు చరిత్రలో లేదు అని విజయశాంతి హెచ్చరిక జారీ చేశారు. వారే మీకు, మీ సర్కార్ కు తగిన సమాధానం చెబుతారని విజయశాంతి పేర్కొన్నారు.