రేసులో ముందున్న విజయశాంతి, అజారుద్దీన్..! : టీపీసీసీ చీఫ్ ఎవరికి..?
న్యూఢిల్లీ / హైదరాబాద్ : అధికార పార్టీ సామర్థ్యం ముందు నిలబడలేక ఇప్పటికే తెలంగాణలో చతికిలపడిన కాంగ్రెస్.. భవిష్యత్తులోనైనా పార్టీ కోలుకునే విధంగా మార్పులు చేర్పులకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతకొద్ది రోజులుగా టీపీసీసీ చీఫ్ పదవి చర్చల్లో నానుతూ వస్తోంది.
ఉత్తమ్ కుమార్ ను టీపీసీసీ చీఫ్ నుంచి తప్పించడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపైనే ఇంకా స్పష్టత రావట్లేదు. దీంతో రేసులో ఉన్న పేర్లతో రోజుకో ఊహాగానం తెరపైకి వస్తోంది. అయితే కొత్తవారికే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలన్న యోచనలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ క్రికెటర్, ఎంపీ అజారుద్దీన్ పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే.. ఈ ఇద్దరిలో ఒకరికి బాధ్యతలు అప్పగించడమే సరైన నిర్ణయమన్న ఆలోచనలో హైకమాండ్ వర్గాలు ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. సినీ గ్లామరే గాక తెలంగాణ ఉద్యమ నేతగాను విజయశాంతికి ప్రజల్లో మంచి స్థానమే ఉండడంతో, పార్టీని బలోపేతం చేసేందుకు విజయశాంతి నాయకత్వం ఉపయోగపడుతోందని కాంగ్రెస్ హైకమాండ్ బావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల భోగట్టా.
ఇక అజారుద్దీన్ క్రికెట్ గ్లామర్ ముస్లిం మైనారిటీ ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించేందుకు ఉపయోగపడే అవకాశం ఉండడంతో అజారుద్దీన్ అయితేనే కరెక్ట్ అనేది మరికొంతమంది పార్టీ నేతల అభిప్రాయం. వీరిద్దరు గాక షబ్బీర్ అలీ, డీకే అరుణ, గీతారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు సైతం రేసులో ఉన్నా తుది నిర్ణయం అధినేత్రులు సోనియా, రాహుల్ దే కావడంతో టీపీసీసీ చీఫ్ ఎవరిని వరిస్తుందా..? అన్నదానిపై ఇంకా సందిగ్దం కొనసాగుతూనే ఉంది.