ఇక కేసీఆర్ వద్దు: రంగంలోకి విజయశాంతి, సిద్ధం చేసుకున్నా.. నాకు జైలు బెట్టర్: బాంబు పేల్చిన వీహెచ్
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏర్పాట చేసింది. ఈ కమిటీలో తొలి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారితో పాటు ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హనుమంత రావు వంటి పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా తాను కొనసాగలేనని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పారు. తాను 35 ఏళ్లుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పని చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే పార్టీలో పని చేస్తానని స్పష్టం చేశారు. తద్వారా తన బాధ్యతలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
విజయశాంతికి కీలక పదవులు: రేవంత్కు ప్రాధాన్యతపై సీనియర్ల అసంతృప్తి, 'సురేష్ రెడ్డి పేరు'
చంచల్గూడ జైల్లో పెట్టండి, కేసీఆర్తో ఒప్పందం
వీ హనుమంత రావు కూడా గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రచార కమిటీ బాధ్యతల నుంచి పక్కన పెట్టడం కంటే చంచల్ గూడ జైలులో పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని ఆరోపణళు చేశారు. కొందరు కేసీఆర్తో పార్టీలోని కొందరు లోపాయకారి ఒప్పందం ఉందని చెప్పారు.
ప్రచార కమిటీ వాహనం కూడా సిద్ధం చేసుకున్నా
తాను ప్రచార కమిటీ వాహనం కూడా సిద్ధం చేసుకున్నానని విహెచ్ తెలిపారు. తాను ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదన్నారు. కేసీఆర్తో ఎవరికి లోపాయికారి ఒప్పందం ఉందో త్వరలో చెబుతానని బాంబు పేల్చారు. కేసీఆర్ కోవర్టులు ఎవరో చెబుతానన్నారు. తనకు ప్రచార కమిటీలో చోటు కల్పిస్తానని కుంతియా హామీ ఇచ్చారన్నారు. కానీ మన పార్టీలోని కొందరు కేసీఆర్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
విజయశాంతి సుముఖత
కాగా, విజయశాంతి, రేవంత్ రెడ్డి వంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతికి, కార్య నిర్వహక అధ్యక్ష బాధ్యతలను రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనడానికి విజయశాంతి సుముఖత వ్యక్తం చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. బుధవారం బోసురాజు... విజయశాంతి ఇంటికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మళ్లీ టీఆర్ఎస్ రావొద్దు
విజయశాంతిని తాము మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. ఇకపై కాంగ్రెస్ పార్టీలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని, రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయని ఆశించిన ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని విజయశాంతి అభిప్రాయపడ్డారని తెలిపారు. ఎలాగైనా టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి అందరం కలిసి పని చేద్దామని ఆమె ఆకాంక్షించారని చెప్పారు. వారు కలిసిన కాసేపటికే విజయశాంతిని స్టార్ క్యాంపెయినర్గా, ప్రచార కమిటీకి సలహాదారుగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.