మోడీది జాతీయవాదం.. మరి మీది.. కేసీఆర్పై రాములమ్మ గుస్సా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఓ రేంజ్లో ఫైరయ్యారు. మోడీ గెలుపు ఓ గెలుపు అని కామెంట్ చేయడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరి కేసీఆర్ చేసిందేంటి అని మండిపడ్డారు. తాను చేస్తే మంచి, ఇతరులు చేస్తే చెడా అని ప్రశ్నించారు. తనవరకు వస్తే తప్పా .. కేసీఆర్కు తత్వం బోధపడదని విమర్శించారు. ఇతరులపై తేలికగా ఆరోపణలు చేసి .. తాను తప్పించుకోవాలని చూస్తాడని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మోడీ గెలిచారని కేసీఆర్ ఆరోపించారు. దీనికి విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. మరి 2014 ఎన్నికల్లో మీరు చేసింది ఏంటీ అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి గెలువలేదా అని ప్రశ్నించారు. తన వరకు వస్తే తప్పా కేసీఆర్కు తత్వం బోధపడలేదని విమర్శించారు. అభివృద్ధి చేసినంత మాత్రానా గెలువాలని గ్యారెంటీ లేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్నికలంటే ఆయనకు భయం పట్టుకుందని ఆరోపించారు. ఇదే ఆయన భయానికి సాక్ష్యం అని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలు సమయం సమీపిస్తోన్న వేళ కేసీఆర్ స్వరంలో మార్పు వచ్చిందని గుర్తుచేశారు. అంతేకాదు జమిలీ ఎన్నికలకు కేసీఆర్ ఆమోదం తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ మాట సంగతేంటని ప్రశ్నించారు. దీనిని బట్టి కేసీఆర్ నైజం ఏంటో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.