నలుగురు దొంగల కోసమా? మళ్లీ దొరల పాలన కావాలా?: విజయశాంతి, డీకే, భట్టీ ఫైర్
వనపర్తి: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, డీకే అరుణ, విజయశాంతి తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.
బాబు వల్ల తెలంగాణకు రోజుకు రూ.కోటి నష్టం: వివరించిన హరీశ్, ఈ ప్రశ్నలకు సమాధానముందా?
లక్ష కోట్లు ఎటు పోయాయంటే..
కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల ప్రభుత్వం కావాలో, దొరల పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. ఏటా లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ డబ్బంతా ఎక్కడికెళ్లిందో చెప్పమంటే టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు.
కేసీఆర్ ఎక్కడున్నారు?
యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు డీకే అరుణ.
తెలంగాణ నలుగురు దొంగల కోసమా?
టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత బోధనా రుసుముల పథకాన్ని సర్వనాశనం చేశారని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారకర్త విజయశాంతి విమర్శించారు. తెలంగాణ తెచ్చింది నలుగురు దొంగల కోసమా? బడుగు బలహీన వర్గాల కోసమా? అని ప్రశ్నించారు.
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటయ్యాయి..
తెలంగాణలో 20లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, దానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమాధానం చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు.