విశ్వనగరం కాదు,తాగుబోతుల నగరం.!ప్రమాదాల నగరమని మండిపడ్డ విజయశాంతి.!
హైదరాబాద్ : తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామో, లేదో, అనే అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని బీజేపి నాయకురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అయితే రోడ్డు మీద ప్రయాణం దైవాధీనంగా మారిందని అన్నారు. పూటుగా తాగి ఓవర్ స్పీడుగా వాహనాలు నడిపే కొందరు వ్యక్తుల వల్ల జీవితాలు నాశనమైపోతుంటే అధికార యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తోంది తప్ప, ఇలాంటి ఘోరాలను నివారించే చర్యలను చిత్తశుద్ధితో అమలు చెయ్యడం లేదని మండిపడ్డారు. తాజాగా బంజారాహిల్స్, నార్సింగి, గండిపేట్, మాదాపూర్లలో చోటు చేసుకున్న సంఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, పలువురు తీవ్ర గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటనలకు కారణమైన వ్యక్తులందరూ మద్యం సేవించినట్లు తనిఖీల్లో తేలిందని, గత కొన్నేళ్లలో డ్రంకెన్ డ్రైవర్ల కారణంగా ఇంకెన్నో పచ్చని కుటుంబాలు కుప్పకూలిపోయాయని విజయశాంతి టీ సర్కార్ పై విరుచుకు పడ్డారు.
రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు మాత్రం ఒక నాలుగైదు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో వరుస పెట్టి చెకింగులు, కౌన్సిలింగులు పెట్టి క్రమంగా నీరుగార్చేయడం మామూలైపోయిందని అన్నారు. దాంతో ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ వస్తున్నాయని, ఇదంతా ఇలా ఉంటే,బంజారాహిల్స్ ఘటనలో నిందితుడిని కాపాడేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగిన సమాచారాన్ని ఒక మీడియా సంస్థ వెల్లడించిందని, దాదాపు 5 ఏళ్ళ కిందట ఇలాంటి ఘటనకే బలైపోయిన చిన్నారి రమ్య ఉదంతంలో విచారణే ముందుగు సాగడం లేదంటూ ఆ కుటుంబం నేటికీ ఆవేదన చెందుతున్న దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. గతేడాది కాలంలో ఇలా మందుబాబుల క్రౌర్యానికి దాదాపు 800 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయని, నిందితులు అరెస్టయినా కొద్దిరోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని బయట తిరుగుతుండటం బాధిత కుటుంబాల్లో వేదన రెట్టింపు చేస్తోందని విజయశాంతి తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరమని, ఏదేదో చేసేస్తామని, గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోవడం లేదని విజయశాంతి ధ్వజమెత్తారు.