కేసీఆర్కు కమీషన్ రాలేదేమో? అందుకే పీఆర్సీ అలా, కేటీఆర్ ప్రకటనకు విలువున్నా.: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీఆర్సీ, నిరుద్యోగ భృతి అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ళ తరబడి కళ్ళు కాయలు కాసేలా వేచి చూసిన తరువాత వెలువడిన పీఆర్సీ సిఫారసులను గమనిస్తే.. ఈ ప్రభుత్వంలో ఎందుకున్నామా? అని రోదించే పరిస్థితి కనిపిస్తోందన్నారు.
సీఎంకు కమీషన్ రాకుంటే అంతే..
'గడచిన 45 ఏళ్ళలో అతి తక్కువగా 7.5 శాతం ఫిట్మెంట్ సిఫారసు చేసిన పీఆర్సీ నివేదిక ఉద్యోగుల ఆకాంక్షలపై నిప్పులు పోసింది. ఉద్యోగులు 65 శాతం ఫిట్మెంట్ ఆశిస్తే... సిఫారసు అందులో సగం కూడా లేదు. ఈ ముఖ్యమంత్రి తమకు కమీషన్ రాని ఏ విధమైన ఖర్చునూ ఫిట్మెంట్తో సహా దేనికీ అంగీకరించరు' అని విజయశాంతి మండిపడ్డారు.
కమీషన్లు వస్తాయంటే మాత్రం.. లక్షలకోట్లైనా సరే..
'కమీషన్లు దొరికే మోసపు ప్రాజెక్టులకు మాత్రం ఎంతైనా బేఫికర్. వేల, లక్షల కోట్ల అప్పులకైనా బరాబర్ తయార్. సీఎంకి కాంట్రాక్ట్ కమీషన్ మాత్రం బ్రహ్మాండమైన స్థాయిలో గతంలోని 10 పర్సెంట్ నుంచి ఎకాఎకీ 20 పర్సెంట్కు పెంచుకున్నట్టు వ్యాపారవర్గాలు మాట్లాడుకుంటున్నాయ్' అని విజయశాంతి విమర్శించారు.
నిరుద్యోగభృతిపై కేటీఆర్ ప్రకటనా???.. ఓకే
'నిరుద్యోగుల భృతి పై ఈ రోజు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ త్వరలో స్పష్టత వస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి లేదా ఆర్థికమంత్రి ప్రకటించకపోయినా... ప్రస్తుత టీఆరెస్ ప్రభుత్వ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రకటనకు విలువ ఉంటుంది' అని విజయశాంతి వ్యాఖ్యానించారు. అంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ సర్కారులో మరింత చలనం రావాలంటే..?
'అయితే, నిరుద్యోగులకిచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే ఒకొక్కరికీ సుమారుగా రూ.75 వేలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నట్టు తేలింది. మొదట దానిని చెల్లించి, తర్వాత మిగతా ముచ్చట్లు చెబితే మంచిది. అది విడిచి, ఏదో గారడీ కార్యక్రమం మళ్లా మొదలుపెడితే నిరుద్యోగుల తిరుగుబాటు, ఉద్యమాలను ఎదుర్కునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధపడాల్సి రావచ్చు. దుబ్బాక, జీహెచ్ఎంసీలలో బీజేపీ గెలుపు ఫలితాలతోనే ఇంత కదలిక కనబడుతున్నదంటే... రానున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక, కార్పోరేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టిగా కర్రు కాల్చి ఈ కారు సర్కారుకు ఇంకొంత వాత పెడితే మరికొంత చలనం కలిగే అవకాశం ఉండచ్చు' అని విజయశాంతి ఘాటుగా వ్యాఖ్యానించారు.