జేపీ నడ్డాను కలిసిన విజయశాంతి: బీజేపీలో చేరిన గూడూరు నారాయణ్ రెడ్డి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి మంగళవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించారు.
టీఆర్ఎస్ అవినీతిని ఎండగడతా..
బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.. విజయశాంతికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టడమే తన లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో 2023లో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారం చేపడుతుందని విజయశాంతి తెలిపారు. కేసీఆర్ను గద్దె దించడమే తన లక్ష్యమని అన్నారు.
తిరిగి బీజేపీలోకి రావడం సంతోషంగా ఉందన్న విజయశాంతి
బీజేపీలో తన పాత్ర ఏంటన్నది పార్టీయే నిర్ణయిస్తుందని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని విజయశాంతి తెలిపారు. తాను తిరిగి బీజేపీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని విజయశాంతి తెలిపారు. తెలంగాణలో 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారు హయాంలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని విజయశాంతి ఆరోపించారు. కాగా, వ్యవసాయ చట్టాల్లో ఏముందో తెలియకుండానే కొందరు ప్రముఖులు తమ అవార్డులను వాపస్ చేసేందుకు సిద్ధమవుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీలో చేరిన గూడూరు నారాయణ్ రెడ్డి..
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన గూడూరు నారాయణ్ రెడ్డి.. ఆ పార్టీ తెలంగాణ కోశాధికారి పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూడూరు నారాయణ్ రెడ్డి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. బండి సంజయ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. రాష్ట్రానికి చెందిన మరికొంత మంది నేతలు కూడా బీజేపీలోకి చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.