అన్న దారిలో చెల్లెమ్మ..! ఏపీ హోదా కోసం రాములమ్మ న్యూ ఫార్ములా
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ చంద్రబాబు వేలు పెట్టారని, రానున్న ఏపీ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకుంటామని పదేపదే హెచ్చరించారు టీఆర్ఎస్ నేతలు. అదేక్రమంలో రాములమ్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆమె కూడా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారా? అనే చర్చ జరుగుతోంది.
స్పెషల్ పోరు..!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ తీవ్రమైంది. ఆ క్రమంలో ప్రత్యేక హోదా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ కేంద్రంలో ఉన్న బీజేపీపై టీడీపీ తీవ్రస్థాయిలో వత్తిడి తెచ్చింది. అయినా బీజేపీ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా జగన్ పార్టీపై టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాపై రాములమ్మ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇలా చేయండి.. హోదా అలా వస్తుంది..!
ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడంపై.. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఎన్డీయే ప్రభుత్వం ధోరణి ఉందన్నట్లు వ్యాఖ్యానించారు విజయశాంతి. ట్విట్టర్ వేదికగా ఏపీ స్పెషల్ స్టేటస్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు నాన్చుడు ధోరణి అవలంభించిన బీజేపీ పెద్దలు.. తమకు ఏపీలో ఉనికి లేదని తేలడంతోనే స్పెషల్ స్టేటస్ ను విస్మరించారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా కాలాయాపన చేసిన కేంద్రం తీరు సరికాదని ధ్వజమెత్తారు. ఇలాంటి సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తున్నా.. అక్కడి పార్టీలు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మద్దతు లేకుండా స్పెషల్ స్టేటస్ ఎలా సాధిస్తారో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్తోనే తెలంగాణ.. ఏపీకి ప్రత్యేక హోదా కూడా..!
కాంగ్రెస్ తో కలిసి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ సాధించడం ఈజీ అనే ధోరణిలో మాట్లాడారు విజయశాంతి. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ను బలపరుస్తూ తీర్మానం చేస్తే... ప్రత్యేక హోదా ప్రక్రియ సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని గుర్తు చేశారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని భావించి కాంగ్రెస్కు మద్దతు పలికానని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన తర్వాతే ఆ పార్టీలో తాను చేరినట్లు చెప్పుకొచ్చారు. అంతలా కాంగ్రెస్ కమిట్మెంట్ తో పనిచేస్తుందనే విషయాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ తో మాత్రమే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.