ఆ భయంతోనే మరో పదేళ్ళు తానే సీఎం అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు: మతలబు చెప్పిన విజయశాంతి
తెలంగాణ బిజెపి నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగిన విజయశాంతి కేసీఆర్ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషం అని అయితే కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైందని పేర్కొన్నారు. ఈ అధికార పార్టీ దోపిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితుల్లో ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్న విజయశాంతి త్వరలోనే కారు మబ్బులను ప్రజలు చెదరగొడతారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికే కేసీఆర్ కొత్త ప్రకటన
సీఎం పదవి పేరుతో దళిత బిడ్డలను మోసం చేసిన కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టాలన్న ఆలోచనపై ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికి, పదేళ్లు నేనే సీఎం అంటూ ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. పదేళ్ల వరకు ఎందుకు కెసిఆర్ 'కారు'మబ్బుల్ని తెలంగాణ ప్రజలు మరో మూడేళ్లలోనే చెదరగొడతారని ఆయన అర్థం చేసుకునే రోజులు దగ్గర పడుతున్నాయని విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్యమే దెబ్బ తింది
మబ్బుల మాటున ఉండే వాన కాలపు సూర్యుడిలా మరో పదేళ్లపాటు ఎప్పుడు ప్రగతిభవన్లో కనిపిస్తాడో ఎప్పుడూ ఫాంహౌస్లో దర్శనమిస్తాడో అర్థంకాని అయోమయంతో జనాన్ని భరించాలని హెచ్చరిస్తున్నట్లు ఉంది కేసీఆర్ వ్యాఖ్యలు అంటూ విజయశాంతి విమర్శించారు. మొత్తానికి ప్రజలు, బిజెపి భయానికే పదేళ్లు సీఎం కేసీఆర్ తానే సీఎం అంటూ ప్రకటించారని విజయశాంతి పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే దెబ్బతిందని, ఆందోళనకరంగా తయారయిందని తెలంగాణ రాములమ్మ సెటైర్లు వేశారు. కెసిఆర్ చేసిన వ్యాఖ్యల మతలబు చెప్పారు.
కేసీఆర్ హాట్ కామెంట్స్ వెనుక ఆంతర్యం చెప్పిన విజయశాంతి
నిన్నటికి నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమని మార్పుపై ఎవరైనా మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడతాం అన్నారు. బండకేసి కొట్టు మరి బయటకు పంపిస్తాం అంటూ హెచ్చరించారు. మార్పు చేయాల్సి వస్తే అందరికీ చెప్పే చేస్తానని, ఎవరైనా అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇక తాను మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగుతానని చెప్పిన కేసీఆర్, ఆరోగ్య పరంగా బాగా ఉన్నానని , దుక్కలా ఉన్నానని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కాగా, కెసిఆర్ వ్యాఖ్యల వెనుక మతలబు చాలానే ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రాములమ్మ.