కేసీఆర్! నాటి మాటలు ఏమయ్యాయ్?: విజయశాంతి, ఆ విషయంలో సంపూర్ణ మద్దతు
హైదరాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న కేసీఆర్.. తర్వాత ఆ ఊసే లేదని అన్నారు. అంతేగాక, 2016, ఏప్రిల్ 14వ తేదీన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు విజయశాంతి.
సీఎం కేసీఆర్! ఓవైసీకి వేరే న్యాయం ఏమైనా ఉందా?: విజయశాంతి ఆగ్రహం
ఆ ఊసేలేదు..
‘దళిత ముఖ్యమంత్రి ఊసు పక్కకు పోయింది, దళితులకు 3 ఎకరాల భూమి రాకుండానే పోతోంది, దళిత ఉప ముఖ్యమంత్రులు కూడా ఏమయ్యారో అడగలేని స్థితిలో దొర ప్రభుత్వం నడుస్తున్నది' అంటూ విజయశాంతి ఘాటుగా విమర్శించారు.
అంబేద్కర్ వచ్చి అడగాలా?
‘ఎప్పుడో 2016లో చెప్పిన మాటల్ని (FB linkలో వీడియో) గుర్తుంచుకుని మహానుభావుడు అంబేద్కర్ జీ వచ్చి, విగ్రహం అడుగుతారా? భవన్ అడుగుతారా? నేనియ్యకుంటే.. అన్నట్లు సీఎం దొరగారు భావిస్తున్నట్లు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలేమో...' అని విజయశాంతి.. కేసీఆర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆ విషయంలో సంపూర్ణ మద్దతంటూ..
కాగా, కరోనా విపత్కర పరిస్థితి నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని విజయశాంతి సమర్థించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్డౌన్కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితులలో ప్రజాసంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్ధిస్తున్నాను' అని విజయశాంతి సానుకూలంగా స్పందించడం గమనార్హం. కేసీఆర్ ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించగా.. ప్రధాని మే 3 వరకు ప్రకటించారు.
Recommended Video
ఇటీవల కేసీఆర్ లక్ష్యంగా విజయశాంతి విమర్శలు..
లాక్డౌన్ సమయంలో ప్రధాని పిలుపును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హేళన చేయడంపైనా గతంలో విజయశాంతి స్పందించారు. ‘మరి గతంలో తెలంగాణ సీఎంగారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రధాని పిలుపును సోషల్ మీడియాలో అవహేళన చేసిన వారిపై చర్య తీసుకోమని డీజీపీ గారిని ఆదేశించారు కదా... గతంలో చెప్పిన విధంగా ఇప్పుడు ఓవైసీ గారిపై ప్రధానిని అవహేళన చేసినందుకు చర్యలు ఉంటాయా? లేక సామాన్యుడికి ఒక న్యాయం అసదుద్దీన్ గారికి ఒక న్యాయం అన్న చందంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అనే విషయంపై తెలంగాణ సీఎం గారు స్పష్టత ఇవ్వాలి అని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు' సీఎం కేసీఆర్ను విజయశాంతి నిలదీశారు.