విచ్చలవిడి దోపిడీ: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి, వేలకోట్ల అవినీతి అంటూ వివేక్
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదన్నారు. విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు.
Recommended Video
ప్రజలు కోరుకున్నది ఈ తెలంగాణ కాదు...
నాగోల్లో బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు కోరుకున్నది ఇలాంటి తెలంగాణ కాదన్నారు. నా తెలంగాణ ఎటువైపు పోతుందో అర్థం కావడం లేదు. నా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి..
ప్రజలు కోరుకున్న రాష్ట్రాన్ని సాధించాలన్నా.. అభివృద్ధి తెలంగాణ కావాలన్నా మరోసారి తీవ్రస్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చిత్తశుద్ధి, ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.
కండువాలేని టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు..: వివేక్
మరోవైపు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, పోలీసుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. పోలీసులు కండువా లేని టీఆర్ఎస్ నాయకులుగా మారరని అన్నారు. ఎమ్మెల్యేల కబ్జాలు, ఇసుక మాఫియాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయించిన ఘనత బీజేపీదేనని అన్నారు.
ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి.. కేసీఆర్ కట్టిన ఇళ్లెన్ని..? వివేక్
వెంకటస్వామి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కోట్లాడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తీసుకొస్తే.. కేసీఆర్ కమీషన్ల కోసం రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. రూ. 25వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచడమేగాకుండా, అదనంగా మూడో టీఎంసీ పేరుతో మరో రూ. 25వేల కోట్లకు పెంచారన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులకు పదవులు ఇవ్వడం తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు 35 లక్షల ఇళ్లు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ సర్కారు 25 లక్షల ఇళ్లు పేదవాళ్లకు కట్టించారని.. తెలంగాణలో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టారని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు చేసివుంటే కరోనా రోగులకు ఎంతో ఉపయోగంగా ఉండేదన్నారు. ప్రధాని అవాస్ యోజన, కిసాన్ నిధి ద్వారా వేలాది మందికి ఎంతో లభ్ది చేకూరుతుందని వెంకటస్వామి వ్యాఖ్యానించారు.