కేసీఆర్.. నీ ఆటలిక సాగవు; పార్టీ ఆఫీసుకు 70కోట్ల విలువైన భూకేటాయింపుపై విజయశాంతి ఫైర్
టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ కు ఖరీదైన స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం పై తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. తాజాగా బిజెపి నాయకురాలు విజయశాంతి 70 కోట్ల రూపాయల విలువైన భూమిని టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసుకు కేటాయించడం దారుణం అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.
అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కారుచౌకగా భూమిని కేటాయించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వం రూ.70 కోట్ల విలువైన భూమిని కేటాయించింది. ఇంత విలువైన భూమి టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు ఇంటి పక్కనే ఉందని పేర్కొన్న విజయశాంతి, దీన్ని కేటాయించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేయగానే... సచివాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నెల 9న జిల్లా కలెక్టర్ శర్మన్ ప్రతిపాదనలు పంపారని వెల్లడించారు. ఆ మరుసటి రోజే భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం... భూమి కేటాయింపుపై సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ఫైలును పంపించిందని పేర్కొన్నారు.

ఆ తర్వాత రోజు అంటే, మే 11న రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆగమేఘాల మీద భూమిని కేటాయిస్తూ జీవో నం.47ను జారీ చేశారని చెప్పి విజయశాంతి భూ కేటాయింపు ప్రక్రియ ఎంత శరవేగంగా జరిగిపోయిందో వెల్లడించారు. ఎన్బీటీ నగర్లో గజం రూ.లక్షన్నర ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ రూ.70 కోట్లపైనే ఉంటుందని విజయశాంతి పేర్కొన్నారు. కానీ, 2018 ఆగస్టు 16న ప్రభుత్వం విడుదల చేసిన పాలసీ ప్రకారం గజం రూ.100 చొప్పున టీఆర్ఎస్ పార్టీ ఈ స్థలానికి రూ.4.93 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కార్ అధికార దుర్వినియోగానికి ఇదొక మచ్చు తునక మాత్రమే.. ఇలాంటి రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతునే ఉన్నాయి అని విజయశాంతి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపు జరిపిన అంశాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. కేసీఆర్... నీ ఆటలు ఇక ఎంతో కాలం సాగవు అంటూ విరుచుకుపడ్డారు విజయశాంతి. ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారని మీకు, మీ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే రానుందని విజయశాంతి కెసిఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఇక విజయశాంతి ట్వీట్ తో తెలంగాణ రాష్ట్ర నెటిజన్లు కూడా తెలంగాణ సర్కారు తీరుపై మండిపడుతున్నారు.
పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపు మెరుపువేగంతో చేసుకున్న టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇవ్వాల్సిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఎందుకు దూకుడుగా పనులు చేయడం లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను అప్పనంగా కాజేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.