ఆ లోటు మీరే తీర్చాలి: కేసీఆర్కు షాకిస్తూ తెలంగాణ గవర్నర్కి వెల్కమ్ చెప్పిన రాములమ్మ!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పనితీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా వచ్చిన తమిళసాయి సౌందరరాజన్కు స్వాగతం పలుకుతూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదూ చేశారు.
మీరే చూడాలి..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత అయిన తమిళసాయి సౌందరరాజన్ ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత విజయశాంతి గవర్నర్కు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా గవర్నర్ అయిన మీరైనా రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
రాజకీయం వేడెక్కిన తరుణంలో..
మొదటగా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సౌందరరాజన్కు విజయశాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాజకీయం బాగా వేడెక్కిన తరుణంలో తమిళ్ ఇసై సౌందరరాజన్ గారు గవర్నర్గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా నిష్పాక్షిక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ఇదే మా విన్నపం..
తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా ప్రతిపక్షాల పాత్రపై తమిళ్ ఇసై గారికి పూర్తి అవగాహన ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే... 2014లో తొలిసారి కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేబినెట్లో మహిళలు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. రెండోసారీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా... 9 నెలలు గడుస్తున్నా, కేసిఆర్ గారి క్యాబినెట్లో మహిళలకు ఛాన్స్ దక్కలేదని అన్నారు.
ఆ లోటు మీరే తీర్చాలి..
ప్రస్తుతం మల్లారెడ్డి.. మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అందువల్ల తెలంగాణలోని మహిళల సమస్యలను పట్టించుకునే దిక్కు కూడా కరువైందనే అభిప్రాయం ప్రజలలో ఉంది. ఇలాంటి తరుణంలో తెలంగాణకు మహిళా మంత్రి లేని లోటును తమిళ్ ఇసై తీరుస్తారని భావిస్తున్నాను అని విజయశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో విజయశాంతి ఓ పోస్టు చేశారు. కాగా, ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి విజయశాంతికి మద్దతు లభిస్తుండటం గమనార్హం.