కేసీఆర్! ఆ ఇద్దర్ని ఎంతకు కొన్నావ్, పోరాటం చేద్దాం: విజయశాంతి, అంత ఓపిక లేదు: జగ్గారెడ్డి
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ నేతలను ఎంతకు కొనుగోలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ రాజనీతి ప్రకారం నడుచుకుంటారని భావించామని, కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు.
ఏపీ-తెలంగాణ మధ్య డేటా యుద్ధం!: హైదరాబాద్లో హైడ్రామా, అసలేం జరిగిందంటే?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతకు కొనుగోలు చేశారో కేసీఆర్ చెప్పాలన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ హుందాగా వ్యవహరించిందని, ఎన్నిక ఏకగ్రీవం కావడానికి తామంతా సహకరించామన్నారు. ఎన్నికల్లో అక్రమాలతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వికృత చర్య అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై రాష్ట్ర వ్యాప్త చర్చ జరగాలని వ్యాఖ్యానించారు.
దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం
ఈ నెల 5వ తేదీన ఆందోళనలు చేస్తామని ఉత్తమ్ చెప్పారు. కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని పీసీసీ తమ పార్టీ కేడర్కు పిలుపును ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని ఉత్తమ్ చెప్పారు. ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. రేపు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న చర్యలపై కూడా చర్చ జరగాలని చెప్పారు.
వారిపై వేటు వేయండి
ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని తెరాసపై విజయశాంతి మండిపడ్డారు. ప్రజాతీర్పు కూడా తెరాస అవహేళన చేస్తోందని విమర్శించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తెరాస చేసే ఆకృత్యాలపై పోరాడాలన్నారు. తెరాసలో చేరిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలని డిమాండ్ చేశారు. అంతిమ న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు.
ఇక నాకు ఓపిక లేదు
నేనైతే పార్టీ మారేది లేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పార్టీలు తిరిగే ఓపిక తనకు లేదన్నారు. తన ప్రెస్మీట్లు, చిట్చాట్లు కొంత గందరగోళానికి గురి చేశాయని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ దీనిని తప్పుగా భావించవద్దని చెప్పారు. నా మాటల వెనుక పరమార్థం ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు అందరూ పార్టీని వీడమని సీఎల్పీ సమావేశంలో చెప్పారని జగ్గారెడ్డి అన్నారు.