ఆర్టీసీ గతే అన్ని శాఖలకూ .. కేసీఆర్ పంజా విసరబోతున్నారు జాగ్రత్త : విజయశాంతి హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సారథి, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సంస్థ ను నిర్వీర్యం చేసినట్లుగానే , మిగతా శాఖల సైతం సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తారని, తన పంజా విసరడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులంతా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన విజయశాంతి టిఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు.
కేసీఆర్ పక్కనే కుట్ర..పోటీలో ఎవరు: సీఎం భయానికి కారణం అదే : విజయశాంతి ఫైర్..!
ప్రభుత్వ వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విజయశాంతి మండిపాటు
ఇక విజయశాంతి పెట్టిన పోస్ట్ లో ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని, సీఎం కేసీఆర్ త్వరలో మిగిలిన శాఖల ఉద్యోగుల పై పంజా విసరడానికి సన్నద్ధమవుతున్నారు అన్న వాదన బలంగా వినిపిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలను అన్నిటినీ కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, ఆర్టీసీ విషయంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహం అదేనని విజయశాంతి పేర్కొన్నారు.
ఆర్టీసీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ రెవెన్యూ శాఖ అని విజయశాంతి సంచలనం
కేసీఆర్ ప్రభుత్వం అరాచకం ఆర్టీసీతో మొదలైందన్న విజయశాంతి నెక్స్ట్ టార్గెట్ రెవిన్యూ శాఖ అని అని పేర్కొన్నారు. ఆ తర్వాత మిగిలిన శాఖల అన్నింటికీ వ్యాపించబోతుందన్న అనుమానాలు తెలంగాణ ప్రజలందరికీ కలుగుతున్నాయని విజయశాంతి తన పోస్ట్ లో వ్యక్తం చేశారు. సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుండి ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ఇక ప్రభుత్వ శాఖల్లో కూడా అదే తరహా విధానాన్ని అనుసరించాలి అనుకోవడం చాలా దురదృష్టకరమని తెలంగాణ రాములమ్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తమ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీదికి నెడుతూ కేసీఆర్ ఎదురు దాడి చేస్తున్నారన్న రాములమ్మ
కెసిఆర్ తమ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీదికి నెడుతూ ఎదురు దాడి చేయడం అలవాటుగా మారిపోయింది అన్న విజయశాంతి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అందరూ సంఘటితంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న అరాచకానికి సరైన తీర్పు ఇవ్వాలని, ఇస్తారని విశ్వసిస్తున్నాం అని విజయశాంతి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్షాలదే బాధ్యత అని పేర్కొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి ప్రతిపక్షాలదే బాధ్యత అనేలా ఉందని విజయశాంతి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షాలదే బాధ్యత అంటున్నారని ఎద్దేవా
సమ్మె కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోవడం కూడా ప్రతిపక్షాల వల్లే అని టిఆర్ఎస్ పార్టీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ వాలకం చూస్తే మెట్రో రైలు స్టేషన్ పెచ్చులూడి ఓ ప్రయాణికురాలు మరణించిన, తాజాగా బయోడైవర్సిటీ ప్రయాణించి కారు కింద దూసుకు వచ్చి ప్రాణాలు తీసినా , తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ ఐటీ ఉద్యోగి ప్రాణాలు తీసినా అన్నిటికీ ప్రతిపక్షాలదే బాధ్యత అంటారేమో దొరవారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తానికి సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించి మిగతా శాఖల పైన ఆయన పంజా విసరడానికి సన్నద్ధమవుతున్నారన్న అంశాలపై ఉద్యోగులను జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు విజయశాంతి.