రేపు లేదా ఎల్లుండి.. బీజేపీలోకి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి... క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్...
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీలో చేరబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఆమె బీజేపీలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న వేళ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దానిపై స్పష్టత ఇచ్చారు. రేపు లేదా ఎల్లుండి విజయశాంతి బీజేపీలో చేరబోతున్నట్లు ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో విజయశాంతి బీజేపీ చేరికపై క్లారిటీ వచ్చినట్లయింది. శనివారం(డిసెంబర్ 5) హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కొత్తగా గెలిచిన కార్పోరేటర్లను సన్మానించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
జానారెడ్డి చేరికపై సంజయ్ ఏమన్నారంటే...
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు... తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అదే సమయంలో తండ్రి చేరుతారా... కొడుకు చేరుతారా అన్నది కాదని... ఇద్దరూ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.ఎన్నికల వరకే రాజకీయాలని... ఆ తర్వాత అభివృద్దే తమ ఎజెండా అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని ప్రభుత్వాన్ని కోరుతామని... ఇకనైనా సీఎం కేసీఆర్ తీరు మారకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు.
అలా అయితే సెంచరీ దాటేవాళ్లం...
కనీసం అభ్యర్థులను కూడా ఖరారు చేసే సమయం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ చెప్పు చేతల్లో నడిచిందని ఆరోపించారు. నిజానికి ఇంకా సమయం ఉండి ఉంటే తమ పార్టీ 100 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే మరో 25 స్థానాల్లో గెలిచేవాళ్లమని చెప్పారు. అడ్డదారుల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు బీజేపీకే అండగా నిలిచారన్నారు. ఉన్న తక్కువ సమయంలోనే కార్యకర్తలంతా ఐక్యంగా పోరాడారని... బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు.
Recommended Video
త్వరలోనే భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి...
భవిష్యత్తులో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని సంజయ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర నాయకుల రాకతో స్థానిక ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు.సోషల్ మీడియా ప్రచారం కూడా బీజేపీకి బాగా ఉపయోగపడిందని... బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని అన్నారు. తమ కంటే టీఆర్ఎస్కు కేవలం 9వేల ఓట్లు మాత్రమే ఎక్కువ పోలయ్యాయని అన్నారు. టీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయన్నారు. చాలా స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని... త్వరలోనే గెలిచిన కార్పోరేటర్స్ అందరితో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు.