రాజధానిలో సిమికార్యకర్తలు! వికార్ అనుచరుడి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తీవ్రవాదులు ఉన్నారనే వాదన కలకలం రేపుతోంది. పత్రికల్లో వచ్చిన వార్తాకథనాల ప్రకారం.. నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం మేరకు సిమికి చెందిన మరో ఇరవై నుండి ఇరవై మంది హైదరాబాదులో ఉన్నారని సమాచారం.
ఇటీవల సూర్యాపేటలో ఒక పోలీసు, మరో హోంగార్డును మట్టుబెట్టి పరారైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఆ తర్వాత ఇద్దరు ఎన్కౌంటర్లో హతం కాగా, మరో ఉగ్రవాది ఏమయ్యాడన్నది ప్రశ్నగానే మిగిలింది. తుపాకులతో చెలరేగిపోయిన ఉగ్రవాదులు ఎస్సై, కానిస్టేబుల్ను బలితీసుకున్న సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో అందులోనూ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉగ్రఛాయలు ఉన్నట్టు ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందుతూన్నాయని అంటున్నారు. ఇటీవల ఎన్కౌంటర్లో హతమైన వికారుద్దీన్ స్వయంగా ఏర్పాటుచేసి జాతీయ స్థాయిలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఏర్పరుచుకున్న తెహరిక్ గల్బా ఏ ఇస్లాం సంస్థలోనూ దాదాపు 20 మంది సభ్యులు హైదరాబాదీలే.
వికార్ గ్యాంగ్లో కొందరు మాత్రమే పోలీసులకు చిక్కారు. మరికొందరు సభ్యులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. మిగతా సభ్యులు బయటే ఉన్నారని తెలుస్తోంది. హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయుల సంఖ్య కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, వికారుద్దీన్ అనుచరుడు హసీం ఉజాం అలియాస్ మంజుల్ను గుజరాత్ పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. యూపీలోని లక్నోకు చెందిన మంజుల్ను అహ్మదాబాదు పోలీసులు గత గురువారం అరెస్టు చేశారు. అతనిని విచారించేందుకు తెలంగాణ నిఘా విభాగానికి చెందిన ప్రత్యేక బృందం ఆదివారం అహ్మదాబాదు పయనమైంది.
బోజ్పురి సినిమాలు, టీవీ నటుడైన మంజుల్ అహ్మదాబాదులో జరిగిన కానిస్టేబుల్ వినయ్ యాదవ్ హత్య కేసులో నిందితుడు. వికారుద్దీన్కు ఆయుధాన్ని అందించింది ఇతనే. ఎనిమిదేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. వికారుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు.