విక్రమ్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్: అనంతపురం హంతక ముఠా పనేనా?
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసు మరో కొత్త మలుపు తిరిగింది.
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకూ విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉండవచ్చని, లేకుంటే ఇంట్లోని వారే ఎవరో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తుండగా, ఇప్పుడు దీని వెనుక అనంతపురానికి చెందిన కిరాయి హంతక ముఠా ఒకటి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర..
ఈ క్రమంలో విక్రమ్ కు శత్రువులుగా ఉన్న ఎవరో సుపారీ ఇచ్చి ఆయన్ను హత్య చేయించేందుకు కుట్ర పన్ని ఉంటారన్న కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు కొసాగుతోంది. విక్రమ్ ఇంటికి చడీ చప్పుడు కాకుండా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు ఉపయోగించిన తుపాకిని తీసుకుపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
నాపై కాల్పులు జరిపారు, కఠినంగా శిక్షించాలి: పోలీసులకు విక్రమ్ వాంగ్మూలం ఇదే
అనంతపురానికి పోలీసు బృందం
ఈ కేసులో మరింత సమాచారం కోసం ప్రత్యేక బృందం అనంతపురానికి బయలుదేరి వెళ్లింది. కాల్పుల ఘటనకు ముందు రోజు విక్రమ్, అనంతపురంకు చెందిన వారితో మాట్లాడాడని అతని కాల్ రికార్డు చెబుతుండటం, వారికి విక్రమ్ పెద్ద మొత్తంలో డబ్బు బకాయి పడ్డాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
వాంగ్మూలం ఇచ్చినా స్పష్టత లేదు..
కాల్పుల జరిగిన తర్వాత విక్రమ్ ఇంటి వద్ద నుంచి ఓ నల్లరంగు కారు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం. ఇప్పటికే విక్రమ్, ఆయన భార్య షిపాలి తమ వాంగ్మూలాన్ని తెలిపిన విషయం తెలిసిందే. అయితే, వారి వాంగ్మూలంలో ఎవరు కాల్చారనే విషయం మాత్రం వెల్లడికాలేదు.
ఎన్నో అనుమానాలు.. దర్యాప్తు తర్వాతే..
విక్రమ్, షిపాలిల వాంగ్మూలాలు తీసుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నం, హత్యాయత్నం, ఇతర కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. భారీగా అప్పులు, డ్రగ్స్ కేసుతో లింకు ఉన్నందు వల్లే విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేశాడని మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇప్పుడు మాత్రం హత్యాయత్నంగా మారింది. అయితే, పోలీసుల పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.