ప్రజలు సర్పంచ్గా గెలిపించారు.. కులం కింద కూర్చోబెట్టింది..! కలెక్టర్ సీరియస్, పెద్దలు పరార్
మహబూబ్ నగర్ : స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా.. కులాల అంతరాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. టెక్నాలజీ అరచేతిలోకి అంది వచ్చినా.. కొన్ని గ్రామాలను కులాల జాఢ్యం వెంటాడుతోంది. ఏనాడో కులాల అంతరాలు సమసిపోయాయని చెప్పే వితండవాదులు ఒక్కసారి మహబూబ్ నగర్ జిల్లాకు వస్తే పరిస్థితేంటో అర్థమవుతుంది.
సర్పంచ్ గిరి.. కుర్చేదీ మరి..!
అతను నామినేటెడ్ పోస్టుతో అధికారం చేజిక్కించుకోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల బరిలో నిలిచి సర్పంచ్ గా గెలిచాడు. ప్రజల మద్దతుతో 200 కు పైగా ఓట్ల మెజార్టీ సాధించాడు. అయితే గ్రామ పెద్దలు అతడిని అవమానించారు. వాళ్లందరూ పైన కూర్చుండి.. సర్పంచును మాత్రం కింద కూర్చోబెట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలా ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ కావడంతో అధికారులు విచారణ చేపట్టారు.
గ్రామపెద్దలదే రాజ్యమా?
మద్దూరు మండలంలోని పెదిరిపాడు పంచాయతీ ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ. మొన్నటి ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం ముగ్గురు వ్యక్తులు బరిలో నిలిచారు. అందులో బాలప్ప 200 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఓడిపోయిన ఒక అభ్యర్థి.. బాలప్ప ఇంటి పక్కన ఉన్నవారిని దూషించాడు. తన దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు ఓటేశారని ఆరోపిస్తూ వారి ఇంటికి తాళం వేశాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సర్పంచ్ బాలప్పను ఆశ్రయించారు ఆ కుటుంబ సభ్యులు. విషయం కాస్తా గ్రామపెద్దల దృష్టికి వెళ్లడంతో పంచాయితీ పెట్టించారు.
పంచాయితీ జరుగుతున్న క్రమంలో గ్రామపెద్దలు కుర్చీల్లో కూర్చున్నారు. సర్పంచ్ బాలప్పను పెద్దగా పట్టించుకోలేదు, పైగా ఆయనను కింద కూర్చోబెట్టారు. పంచాయితీ జరుగుతున్నంత సేపు ఆయన అలా కిందనే కూర్చోవడం గమనార్హం. గ్రామపెద్దలు మాట్లాడింది వినడమే తప్ప.. సర్పంచ్ గా ఆయనేమీ మాట్లాడలేదు. మొత్తానికి ఆ పంచాయితీ జరిగిన తీరు గ్రామపెద్దల పెత్తనంలా కొనసాగింది.
అధికారుల విచారణ.. పెద్దలు పరార్
సర్పంచ్ ను అవమానించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో.. నారాయణపేట ఆర్డీవో రంగంలోకి దిగారు. పెదిరిపాడు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే అధికారులు రావడానికి ముందే సదరు గ్రామపెద్దలు కనిపించకుండా పోయారు. మరోవైపు దళిత సర్పంచ్ ను అవమానించారంటూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. అదలావుంటే తాను ఇష్టపూర్వకంగానే కింద కూర్చున్నానని చెబుతున్నారు బాలప్ప. గ్రామపెద్దలకు గౌరవం ఇచ్చే క్రమంలో కుర్చీలు సరిపోకపోవడంతో అలా కింద కూర్చోవాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే గ్రామపెద్దలకు భయపడి బాలప్ప అలా చెబుతున్నారనేది స్థానికుల వాదన. మొత్తానికి అధికారుల విచారణ తర్వాత సర్పంచ్ ను శాసించేలా వ్యవహరించిన ఆ గ్రామ పెద్దలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.