పంచాయతీలకు కరెంట్ షాక్.. గ్రామాల్లో చీకట్లేనా?
మెదక్ : పంచాయతీలకు కరెంట్ షాక్ కొడుతోంది. కోట్లాది రూపాయల కరెంట్ బిల్లులు పెండింగ్ పడటంతో ఇక గ్రామాల్లో చీకట్లు నెలకొనే పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు వినియోగించిన కరెంట్ తాలూకు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అయోమయంలో పడింది. మెదక్ జిల్లాకు సంబంధించి కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీలు వినియోగించిన బిల్లులు చెల్లించలేక కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి. ఆ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఏ క్షణాన కొరడా ఝలిపిస్తారోనని ఆందోళన చెందుతున్నారు సర్పంచులు.
పంచాయతీల కరెంట్ బిల్లులు తడిసిమోపెడు..!
మెదక్ జిల్లాలో మొత్తం 469 గ్రామ పంచాయతీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ క్రమంలో ఆయా గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు వినియోగించే కరెంట్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. దాంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిధులు లేక కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు. అలా కొన్నేళ్లుగా కరెంట్ బకాయిలు పేరుకుపోయాయి. అవి కాస్తా కోట్ల రూపాయలకు చేరాయి. మొత్తం కరెంట్ బిల్లులు కోటి 50 లక్షలకు పైగా పెండింగ్ పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్కో గ్రామ పంచాయతీ లక్షలకొద్దీ కరెంట్ బిల్లులు చెల్లించాల్సి రావడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేస్తే గ్రామాలు చీకట్లో మగ్గుతాయని వాపోతున్నారు.
మంత్రి పదవులు రాలేదని.. మైనంపల్లి అలా.. జోగు రామన్న ఇలా..!
ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీల కరెంట్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ
ఉమ్మడి రాష్ట్రంలో 2010లో గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులను తామే చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు అప్పటినుంచి సర్పంచులు గానీ, పంచాయతీ అధికారులు గానీ కరెంట్ బిల్లుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా అవి తడిసి మోపెడయ్యాయి. అయితే అటు ప్రభుత్వం కరెంట్ బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది రూపాయల కరెంట్ బిల్లులు బకాయి పడ్డాయి. అంతేకాదు కరెంట్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పడంతో కొన్ని గ్రామాల్లో కరెంట్ వినియోగం కూడా ఎక్కువగా జరిగిందనే ఆరోపణలున్నాయి.
2016 తర్వాత పంచాయతీలే కరెంట్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ ఆదేశం
అదలావుంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చాక గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో 2016లో కరెంట్ బిల్లులను పంచాయతీలే చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ మేరకు 2016 తర్వాత పంచాయతీ నిధుల నుంచి బిల్లులు వసూలు చేయడం ప్రారంభించింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సర్పంచులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో రూట్ మార్చిన ప్రభుత్వం ప్రతి ఏటా పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించే నిధుల నుంచి 20 - 25 శాతం మేర రాబట్టుకునేలా పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.
టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది.. మొన్న ఈటల, నేడు నాయిని.. అసంతృప్తుల సెగ వెంటాడుతోందా?
ఇకపై ప్రతి నెల పంచాయతీలే చెల్లించాలా?
పంచాయతీలు చెల్లించాల్సిన కరెంట్ బిల్లులు పేరుకుపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. కోట్లాది రూపాయల పెండింగ్ బకాయిలను వసూలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఆ మేరకు బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులకు లేఖలు రాస్తున్నారు. అదలావుంటే గత సంవత్సరం 14వ ఆర్థికశాఖ పద్దుల కింద జిల్లాలో దాదాపు 40 లక్షల మేర కరెంట్ బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. అవి పోను ఇంకా కోటి 58 లక్షల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇకపై ప్రతి నెలా కరెంట్ బిల్లులు ఆయా గ్రామ పంచాయతీలే చెల్లించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.