గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు
హైదరాబాద్ : గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులమన్నారు టీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత. తాము ఏదీ చేసినా రాష్ట్ర హితం కోసమేనని స్పష్టంచేశారు. ఇదివరకు లానే ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు. శుక్రవారం ఆశేష అభిమానుల సందోహం మధ్య కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు కవిత. రెండుసెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
టీ కాంగ్రెస్ నుండి మరో ఇద్దరు సీనియర్లు ఔట్..! ఎన్నికల ముందు మరో దెబ్బ..!!
గల్లీలో సేవకులం, ఢిల్లీలో సైనికులం
విభజన అంశాలు, రాష్ట్ర, జిల్లాకు సంబంధించిన అంశాలు, మైనార్టీ, ెస్సీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్లో పోరాడామని గుర్తుచేశారు కవిత. 5 ఏళ్లలో చేసిన పనితీరును గుర్తించి హైకమాండ్ మరోసారి టికెట్ ఇచ్చిందని చెప్పారు. తనను మరోసారి గెలిపిస్తే, గులాబీ జెండా రెపరెపలాడుతోందని చెప్పారు. మేం గల్లీలో ప్రజలకు సేవకులం, ఢిల్లీలో సైనికులం అని స్పష్టంచేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వేములు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత పాల్గొన్నారు.
నిధులు, ప్రాజెక్టుల కోసమే ..
రాష్ట్రంలోని 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కవిత. మెజార్టీ స్థానాలు గెలిస్తే అభివృద్ధి పనులు, నిధుల విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. గతంలో టీఆర్ఎస్ ఎంపీల వల్ల రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేశామని గుర్తుచేశారు. హైకోర్టు విభజనకు ప్రధాన కారణం టీఆర్ఎస్ ఎంపీల కృషేనని స్పష్టంచేశారు. దీంతోపాటు ఇతర అంశాల పట్ల కేంద్రంతో పోరాడి .. సాధించామని, మరోసారి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
గులాబీ రంగు కారులో షికారు
నామినేషన్ వేసేముందు కవిత .. గులాబీరంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్ వచ్చారు. కారును ఎమ్మెల్యే గణేశ్ గుప్తా నడుపగా, మరో ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి వెనుకాల ఆశీనులయ్యారు. అంతకుముందు కవిత ఇంటి వద్ద మహారాష్ట్రకు చెంది డోలు కళాకారులు వాయిద్యాల హోరుతో సందడిగా మారింది.
చేరికల పర్వం
అంతకుముందు నిజామాబాద్ జిల్లా టిడిపి అధ్యక్షుడు బాగారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టిడిపి ఇంచార్జి తారా చంద్ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారి అనుచరులు కూడా గులాబీగూటికి చేరారు.