కలెక్టరేట్ నుంచి వచ్చా.. మీ ఆధార్ తప్పులు సరిదిద్దుతా.. పెద్ద బొక్క పెట్టాడుగా..!
వరంగల్ : ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు కొందరు. ఆ క్రమంలో నచ్చినట్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. పెద్దోళ్లను టార్గెట్ చేస్తూ మోసం చేసేవాళ్లు కొందరైతే.. పేదోళ్లను సైతం వదలకుండా వక్రమార్గంలో దోచుకుంటున్నవారు మరికొందరు. తాము బతకాలని మాత్రమే చూసుకుంటున్న మోసగాళ్లు బీదోళ్లను కూడా వదలడం లేదు. తాజాగా ఆధార్ కార్డుల్లో తప్పొప్పులు సరిచేస్తానంటూ ఓ గ్రామ ప్రజలను నట్టేట ముంచిన వైనం వెలుగుచూసింది.
వామ్మో బాల చింపాంజీ.. ఉన్నదే గింత.. ఎగిరెగిరి తన్నిందిగా..! (వీడియో)
చదివింది బీటెక్.. చేసేది హైటెక్ మోసం
వరంగల్ అర్బన్ జిల్లా నెక్కొండ మండలం సీతాపురం గ్రామానికి చెందిన అలువాల వినయ్ కుమార్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. ఈ మధ్యే పెళ్లి చేసుకుని చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామంలో కాపురం పెట్టాడు. అయితే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పీఎం గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ కార్యక్రమంలో జాయిన్ అయ్యాడు. గ్రామాల్లోని యువతకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించడం అతడి బాధ్యత. అలా రెండు నెలల కిందట ఆ కార్యక్రమంలో భాగంగా చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో పనిచేశాడు.
ఆధార్ సెట్ చేస్తానని.. ఖాతాలకు కన్నం
అన్నం పెట్టిన సంస్థకే కన్నం పెట్టే రీతిలో అదే కార్యక్రమాన్ని తన మోసాలకు అనువుగా మలచుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ట్రాక్ తప్పాడు. ఆధార్ నెంబర్లు, వేలి ముద్రలతో ఇతరుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు తన ఖాతాలకు మళ్లించుకునే ప్రయత్నానికి తెర లేపాడు. ఆ క్రమంలో నమిలిగొండ గ్రామాన్ని ఎంచుకున్నాడు.
మోసాల పర్వంలో తొలుత ఆ ఊరి సర్పంచ్ను కలిశాడు. జనగామ కలెక్టరేట్ నుంచి వచ్చానంటూ బుకాయించాడు. గ్రామస్తుల ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లా పేరు మార్చాలని.. తద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం నేరుగా వారి ఖాతాల్లో జమవుతాయని నమ్మించాడు. సదరు మోసగాడిని గుడ్డిగా నమ్మిన సర్పంచ్ ఓకే అన్నాడు.
వివరాలు సేకరించి.. డబ్బులు తస్కరించి..!
సర్పంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మోసగాడు ల్యాప్టాప్, ఫింగర్ ప్రింట్ డివైస్తో గ్రామంలో వాలిపోయాడు. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు బయోమెట్రిక్ ద్వారా గ్రామస్తుల ఆధార్ కార్డుల వివరాలు, వేలిముద్రలు సేకరించాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో డిజీ పే యాప్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాల నుంచి 600 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు తన ఖాతాకు మళ్లించుకున్నాడు. అలా 2 లక్షల 59 వేల 500 రూపాయలు డ్రా చేశాడు.
తమ ఖాతాల నుంచి డబ్బులు కట్ అయినట్లు మొబైల్ ఫోన్లకు మేసేజ్లు రావడంతో గ్రామస్తులు సర్పంచ్ను కలిశారు. దాంతో ఆయన సదరు మోసగాడికి కాల్ చేశారు. త్వరలోనే వచ్చి కలుస్తానని బుకాయించి తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరకు తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సోమవారం నాడు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి ల్యాప్టాప్, ఫింగర్ ప్రింట్ డివైస్ను స్వాధీనం చేసుకున్నారు. నేరం ఒప్పుకున్న అలువాల వినయ్ కుమార్ను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.