షాకింగ్ : శీలానికి వెలకట్టి పంచుకున్న పెద్ద మనుషులు.. వరంగల్లో దారుణం..
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో దారుణం జరిగింది. అత్యాచార యత్నానికి గురైన ఓ అమ్మాయి శీలానికి వెలకట్టిన పెద్ద మనుషులు.. తలా కొంత డబ్బును పంచుకున్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పి... చివరకు మరింత అన్యాయం చేశారు. దీంతో బాధితురాలి కుటుంబం ఆవేదనతో తల్లడిల్లుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. రాయపర్తి మండలంలోని ఓ తండాకు చెందిన అబ్బాయి,సమీప గ్రామంలోని ఓ అమ్మాయిపై ఇటీవల అఘాయిత్యానికి యత్నించాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్ద మనుషులకు ఫిర్యాదు చేయగా.. అబ్బాయి కుటుంబ సభ్యులను పిలిపించి పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాయి చేసిన తప్పుకు రూ.2లక్షలు జరిమానా విధించారు. అయితే ఆ మొత్తం డబ్బును పెద్ద మనుషులే తలా కొంత పంచేసుకున్నారు. ఇదేంటని నిలదీసినందుకు.. ఆ అమ్మాయి కుటుంబాన్నే దబాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది.
సాధారణంగా గ్రామాల్లో పెద్ద మనుషుల సమక్షంలో జరిగే పంచాయితీలకు.. వారు నిర్ణయించిన మేర ఇరు వర్గాలు ముందుగానే కొంత డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పంచాయితీ నిర్వహించినందుకు గాను పెద్ద మనుషులు ఆ డబ్బును తీసుకుంటారు. పంచాయితీ అనంతరం అదే డబ్బుతో అంతా కలిసి మద్యం సేవిస్తారు.
ఒకవేళ పంచాయితీ ఎటూ తెగకపోతే.. మరోసారి సమావేశమయ్యేందుకు నిర్ణయిస్తారు. అప్పుడు మళ్లీ డిపాజిట్ డబ్బులు చెల్లించాల్సిందే. ఇలా ఎన్నిసార్లు పంచాయితీ నిర్వహిస్తే అన్నిసార్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి గ్రామాల్లో భూముల వ్యవహరాలు ఎక్కువగా పెద్ద మనుషుల సమక్షంలోనే పరిష్కారమవుతుంటాయి. అయితే అత్యాచారాలు,ఇతరత్రా నేరాలకు సంబంధించి కొన్నిసార్లు పంచాయితీలు చేసే తీర్మానాలు వివాదాస్పదమవుతుంటాయి.