ఆ పని చేస్తుండగా ఫోటోలు తీశారు. హెచ్ఆర్సీని ఆశ్రయించిన వికారబాద్ ప్రజలు..!!
భారత ప్రభుత్వం మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలని చెప్పింది. స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి టాయ్లెట్ల నిర్మాణం చేపట్టింది. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు త్వరగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే జిల్లా కేంద్రాల నుంచి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకుంటే ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇక దీంతో చాలామంది గ్రామస్తులు విసిగిపోతున్నారు. మరికొందరు అధికారులైతే బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఫోటోలు తీసి జిల్లా ఉన్నతాధికారులకు పంపుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో పలు గ్రామపంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. లోక్సభ ఎన్నికల తర్వాత మొత్తం 91,971 మరుగుదొడ్లను నిర్మించాలని అధికార యంత్రాంగం ఆదేశించింది. జూలై మొదటి వారంకల్లా 50 వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాగా మరో 40వేల కుటుంబాలు తామే నిర్మించుకుంటామంటూ ముందుకొచ్చాయి. ఒక వెయ్యి కుటుంబాలు మాత్రం మరుగుదొడ్ల నిర్మాణంపై ఏ మాటా చెప్పలేదు. ఇక వీరిపై ఫోకస్ చేశారు అధికారులు. మరుగుదొడ్ల నిర్మాణం సత్వరమే ప్రారంభించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. అంతేకాదు అన్నంత పని చేశారు.
ఈ నెల 15న థరూర్ మండలం నాగసమందర్లో 35 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతేకాదు మహిళలు బహిర్భూమికి వెళితే వారిని అడ్డుకోవడం, మలవిసర్జన కూర్చున్న వారి ఫోటోలు తీసి అధికారులకు పంపడం వంటివి చేస్తుండటంతో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణంకు రూ.35వేల నుంచి 40 వేలు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం కేవలం రూ. 12 వేలు మాత్రమే చెల్లిస్తోందని మిగతా డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని పేదవారైన ఆ బాధితులు ప్రశ్నిస్తున్నారు.