మా బాధ వినలేదు: ఫ్యాక్టరీకి నిప్పుపెట్టిన గ్రామస్తులు
హైదరాబాద్: కాలుష్యం వల్ల తమ పంటలు పాడవుతున్నాయని, తమ ఆరోగ్యం ఇబ్బందుల పాలవుతుందని ఎంత చెప్పినా.. ఏ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఒక్కసారిగా కాలుష్య కారకమైన టైర్ల రీసైక్లింగ్ కంపెనీపై దాడి చేసి, నిప్పంటించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లిలో సోమవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చన్వెల్లి గ్రామంలో టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమను నగరానికి చెందిన సతీష్రెడ్డి పేరుతో విద్యావంత్రెడ్డి అనే వ్యక్తి ఎనిమిదేళ్ల కిందట ఏర్పాటు చేశారు. దీన్నుంచి పొగ వెలువడి గ్రామస్థులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
మూసివేయాలని కోరినా..
కంపెనీ మూసివేయాలని స్థానికులు పలుమార్లు యజమానులను కోరారు. అయినా, వారు పట్టించుకోలేదు. దీంతో రెండు గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. గతంలో అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా తీరు మారలేదు.
తాళం వేసి నిరసన
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పరిశ్రమ వద్దకు యాజమానితో మాట్లాడేందుకు వెళ్లారు. కొందరు యువకులు కంపెనీ మూసివేయాలంటూ సిబ్బందిని బయటకు పంపించి తాళం వేశారు. అదే సమయంలో సూపర్వైజర్ కంపెనీ యజమానికి ఫోన్ చేసి, అక్కడున్న గ్రామస్థులకు స్పీకర్ పెట్టి వినిపించాడు.
యజమాని తిట్టడంతో కంపెనీకి నిప్పు
ఆ సమయంలో యజమాని ఫోన్లో తిట్టడంతో ఆగ్రహించిన గ్రామస్తులంతా టైర్లపై పెట్రోలు పోసి నిప్పంటించారు. పెద్దఎత్తున మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం మంటల్లో కాలిపోయింది. కంపెనీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో చేవెళ్ల అగ్నిమాపక వాహనం రాగా.. గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి మంటలు ఆర్పేందుకు అడ్డుపడ్డారు.
అందరిపై కేసులు పెట్టండి..
ఈ సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సీఐ గురవయ్య, ఎస్సై శ్రీధర్రెడ్డి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. కంపెనీకి నిప్పంటించిన యువకులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా, గ్రామస్థులంతా చేవెళ్ల పోలీస్ స్టేషన్కు వచ్చి.. అందరం కలిసే ఈ పని చేశామని, అందరిపైనా కేసులు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.