వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా ముందు విషాదం: కెసిఆర్ అత్తింటి ఊరు సహా పలు పల్లెలు ఖాళీ

ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి ‘మిడ్ మానేరు’ రిజర్వాయర్‌ను నీరు నింపేయడంతో నాలుగు గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పండుగ అంటే అందరికీ ఆనందమే. అందునా దసరా పండుగ అంటే తెలంగాణలో సంబురమే. ఇక డబ్బూ దస్కం ఉన్న వారి సంతోషం చెప్పలేం. కానీ కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలకు మాత్రం ఈ ఏడాది విజయదశమి పండుగ విషాదమే మిగులుస్తున్నది.

అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్తగారి ఊరు కొదురుపాకతోపాటు పలు గ్రామాల ప్రజలు ఉన్నారు. వారంతా కన్నీటితో ఏళ్ల తరబడి పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి వెళుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మధ్య మానేరు రిజర్వాయర్ ముంపు గ్రామాలకు ప్రభుత్వం అందజేస్తున్న పరిహారం ప్రజలతో కంటనీరు పెట్టిస్తున్నది. వసతుల కల్పన తీరు నిశ్చేష్టులను చేస్తున్నది.

యువతకు ఉపాధి కల్పిస్తామని సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీర్ హరీశ్ రావు ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలుగా మారాయి. అరకొర పరిహారం కూడా మధ్యమానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు సరిగా అందలేదు. 'ముంపు గ్రామాల్లోని 4000 మంది యువకులకు తలా రెండు లక్షల రూపాయలిస్తాం' అని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోనే లేదు.

వసతుల కల్పనపై పట్టని అధికార యంత్రాంగం

వసతుల కల్పనపై పట్టని అధికార యంత్రాంగం

వేములవాడ రాజన్న సాక్షిగా సీఎం కేసీఆర్ 'ముంపు గ్రామాల ప్రజలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టిస్తాం. ప్రతి కుటుంబానికీ పరిహారం అందిస్తాం' అని హామీలు గుప్పించారు. మరో ఏడాది తర్వాత కరీంనగర్‌లో అసాధ్యమని చేతులు ఎత్తేశారు. ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలేమీ కల్పించకుండా ఉన్న ఫళంగా ఖాళీ చేయాలని అధికారులు ఊళ్ల మీద పడ్డారు. దసరా పండుగ పూట ఇండ్లు ఖాళీ చేయించడంతో సీఎం అత్తగారి గ్రామం కొదురుపాక సహా పలు పల్లెల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. బరువెక్కిన హృదయాలతో పుట్టిన ఊరు వీడుతున్నారు. సొంతింటిని చేజేతులా కూల్చుకుంటూ పండగపూట చివరి జ్ఞాపకాలకు దూరమవుతున్నామని బాధిత కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి.

శంకుస్థాపన చేసినా పనులు చేపట్టిన గత కాంగ్రెస్ సర్కార్

శంకుస్థాపన చేసినా పనులు చేపట్టిన గత కాంగ్రెస్ సర్కార్

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీటిని మధ్యమానేరులో నింపి అక్కడి నుంచి మల్లన్న సాగర్‌కు తరలించాలని సర్కార్ ప్రణాళిక. పుష్కర కాలం కిందే శంకుస్థాపన చేసిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిని మాత్రం విస్మరించింది. దీంతో పునాదులకే పరిమిత‌మయ్యాయి. సొంతరాష్ట్రంలో మళ్లీ పనులు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మిషన్‌ భగీరథలో భాగంగా మిడ్‌మానేరులో 10 టీఎంసీల నీటిని నింపాలని ప్రభుత్వం భావించింది. వచ్చే డిసెంబర్‌కల్లా నీటి నిల్వ ఉంచాలని నిర్ణయించింది. ప్రతిరోజూ నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజుల్లో నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు టీఎంసీల మేర నీరు డ్యామ్‌కు చేరుకున్నది. వాటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తారు. అయితే ఎస్సారెస్పీ నుంచి క్రమంగా నీరు చేరుకోవడంతో ముంపును గుర్తించిన అధికారులు పక్కనే ఉన్న నాలుగు గ్రామాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పరిహారం చెల్లింపు కోసం నిర్వాసితుల ఆందోళన

పరిహారం చెల్లింపు కోసం నిర్వాసితుల ఆందోళన

ముందు రాజన్న- సిరిసిల్ల జిల్లాలోని కొదురుపాక, నీలోజిపల్లి, రుద్రవరం, చీర్ల వంచ గ్రామస్తులు ఇండ్లను వదిలి వెళ్లిపోవాలంటూ అధికారులు డప్పు చాటింపు వేయించారు. తర్వాత బోయినపల్లి మండలంలోని వర్దవెల్లి, శాభాష్‌పల్లి, మాన్వాడ, వేములవాడ మండలం కొడుముంజ, అనుపురం, సంకెపల్లి, సిరిసిల్ల మండలం చింతల్‌ఠాణా గ్రామాల నిర్వాసితులను కూడా తరలించనున్నారు. పరిహారం పూర్తిగా చెల్లించకుండానే ఖాళీ చేయించడంతో స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే చీర్లవంచ నిర్వాసితులు సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలకు దిగారు.

యువతకు పరిహారం హుష్ కాకి

యువతకు పరిహారం హుష్ కాకి

ముంపు గ్రామస్తులకు పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పునరావాస కాలనీలు ఎక్కడా పూర్తికాలేదు. పూర్తయిన చోట విద్యుత్‌, నీటి సరఫరా లేదు. కొందరికీ ఇప్పటికీ ఇండ్ల పట్టాలు ఇవ్వలేదు. పదేండ్ల కింద ఎకరాకు రూ.2.10 లక్షల చొప్పున మాత్రమే చెల్లించారు. కానీ, పంట భూములు కోల్పోవడంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోయింది. పైగా, కొన్ని కుటుంబాలకు పరిహారం, ఇండ్ల స్థలాల పట్టాలు కూడా రాలేదు. ప్రస్తుతం ఖాళీ చేయిస్తున్న కొదురుపాక, రుద్రరం, నిలోజిపల్లి, చీర్లవంచ గ్రామాల్లో నాలుగువేల ఇండ్లు ఉన్నాయి. ఇంకా 500 ఇండ్లకు పరిహారం చెల్లించలేదు. 18 ఏండ్లు నిండిన యువకులు నాలుగు వేల మంది ఉన్నారు. వారందరికీ ఉపాధి కోసం రూ.రెండు లక్షల చొప్పున చెల్లిస్తామని ఈ గ్రామాలను సందర్శించినప్పుడు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అయినా ఇంతవరకు ఏ ఒక్కరికీ పరిహారం అందలేదు. యువతులకు సైతం ఇవ్వాలన్న డిమాండ్‌ అటకెక్కింది. ఇండ్లు కట్టుకునేందుకు ఇవ్వాల్సిన పట్టాలు 500 కుటుంబాలకు ఇప్పటికీ ఇవ్వలేదు.

ఇళ్ల పట్టాల పంపిణీలోనూ జాప్యం

ఇళ్ల పట్టాల పంపిణీలోనూ జాప్యం

నీలోజిపల్లి గ్రామ నివాసి కూస నర్సయ్య - రామవ్వ. వారికి నలుగురు కొడుకులు ఉన్నారు. పదేళ్ల కింద ఎకరాకు రూ.2.10 లక్షల చొప్పున ఎనిమిది ఎకరాలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. మరో ఎకరా భూమి ఉన్నా దాటవేసింది. నలుగురు కొడుకులు విడివిడిగా ఇండ్లు కట్టుకుని ఉంటున్నా వారి ఇండ్లకు ఏ ఒక్కరికీ పరిహారం అందలేదు. పెద్దకొడుకుకు 18 ఏండ్లు దాటిన ఇద్దరు కొడుకులు ఉన్నారు. పల్లెటూరి రాజకీయాలతో వారు పరిహారం నోచుకోలేదు. మూడో కొడుకు మహేందర్‌ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎంపీటీసీకి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. భార్య మెడలో బంగారం కూడా అమ్ముకుని నష్టపోయాడు. పోటీ చేయడం టీఆర్‌ఎస్‌ నాయకులకు అది గిట్టలేదు. అది మనస్సులో పెట్టుకుని ఇప్పటికీ ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో కూస నర్సయ్య కొడుకుల కుటుంబాలు ఇండ్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.

కూలీతో పొట్టనింపుకోవడమే పరిష్కారమంటున్న బాధితులు

కూలీతో పొట్టనింపుకోవడమే పరిష్కారమంటున్న బాధితులు

పండుగ నాడు ఏడ్సుకుంట పోతున్నామని కొదురుపాక వాసి దూలపల్లి పుష్ప తెలిపారు. బతుకమ్మ చీరలు తమ చేతుల్లో పెట్టి ఏడుపు మిగిల్చారని, కొత్తగా నిర్మాణం చేపట్టిన ఇల్లు సగం కూడా పూర్తి కాకున్నా అక్కడికే పోతున్నట్లు చెప్పారు. 18 ఏళ్లు ఉన్న కొడుక్కు పరిహారం రాలేదని, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే దాక అధికారులు, ప్రభుత్వం ఓపిక పట్టలేదని ఆరోపించారు. పండుగ అని కూడా చూడకుండా ఎకాఏకిన ఊరు ఖాళీ చేయిస్తున్నారని కొదురుపాక నివాసి రేణుక చెప్పారు. తమకు బతుకమ్మ చీరలిచ్చి తమ బతుకు బజారు పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పండుగ పూట నీడలేకుండా చేసిన ప్రభుత్వం చూపిన జాగాలో ఇక గుడిసె వేసుకోవాల్సిందేనన్నారు. ముత్తగాల జగన్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఎకరంన్నర పొలానికి పదేళ్ల క్రితం డబ్బు ఇచ్చారని, మరో 1.5 ఎకరం భూమి తాతలనాటి నుంచి సాగు చేసుకుంటున్నామని, దానికి ఇమ్మంటే కాగితాలు చూపమన్నారని, ఏళ్ల తరబడి సాగుచేస్తున్నా కాగితాల్లేవని, ఇప్పుడు నీళ్లు నిండటంతో పొలం కూడా ఉండదని అన్నారు. తన ఇద్దరు కొడుకులకు పరిహారం రాలేదని పొలం కూడా పోతుంటే కైకిలికి పోవడమే తమకు మిగిలిందని జగన్ చెప్పాడు.

English summary
This year Vijaya Dashami Festival will bad environment for Some Villages. Particularly united Karim Nagar district villages are effected. Specially Kodurupaka village which is Telangana state chief minister KCR's Son-in-law's village among so many villagers vacated with force for Mid Maneru Reservior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X