గులాబీ కే పట్టం కట్టిన పల్లెలు..! మలి విడతలో కూడా వార్ వన్ సైడే..!!
హైదరాబాద్ : తలెంగాణ పల్లెలు గులాబీ మయం అయ్యాయి. రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీకి పెద్దయెత్తున పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. అన్ని జిల్లాల్లోనూ తెరాస జోష్ కనిపించింది. ఏకగ్రీవమైన 788తో కలిపి, దాదాపు 63 శాతం పంచాయతీల్లో తెరాస మద్దతుదారులే విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 20 శాతం పంచాయతీలను సొంతం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ, టీడిపి, సీపీఐ, సీపీఎంలు రెండంకెల సంఖ్యకే పరిమితమవ్వడం విశేషం..!
గ్రామాల్లో సత్తా చాటిన గులాబీ..! మెజారిటీ స్థానాలు కైవసం..!!
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,342 పంచాయతీల్లో 88.26 శాతం పోలింగ్ నమోదయింది. ఇది మొదటివిడత కన్నా 2.5 శాతం అదనం. ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలు పురుషులకన్నా ముందు నిలిచారు. మహిళలు 88.85 శాతం, పురుషులు 87.67 శాతం ఓటుహక్కును వినియోగించుకున్నారు. 26,209 వార్డుల్లోనూ పోలింగ్ ప్రక్రియ సాఫీగా పూర్తవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పంచాయితీకి పోటెత్తిన జనం..! ప్రశాంతంగా ముగిసిన మలివిడత..!!
ఉదయం 7 గంటలకు పల్లె పోరు ప్రారంభం కాగా 11 గంటలకే పోలింగ్ 65.87 శాతానికి చేరుకుంది. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల నుంచి ఓటర్లను అభ్యర్థులు వాహనాల్లో తరలించారు. వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులను తీసుకొచ్చి వారితో ఓటు వేయించుకున్నారు. కరీంనగర్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓటర్లకు కొందరు అభ్యర్థులు అల్పాహారం, భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.
రెండో విడతలో యాదాద్రే ముందు..! ప్రభావం చూపిన పుణ్యక్షేత్రం..!!
మలివిడత పంచాయతీ పోరులోనూ యాదాద్రి భువనగిరి జిల్లానే 93.71 శాతం పోలింగ్తో మొదటి స్థానంలో నిలిచింది. మొదటి విడతలో ఈ జిల్లాలో 85 శాతం నమోదు కావడం విశేషం. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 80.23 శాతం పోలింగ్ నమోదయింది. పది జిల్లాల్లో 90 శాతానికి మించి ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు.
ఆ పది జిల్లాల్లో పురుషుల వెనుకబాటు..! లేచింది మహిళా లోకం..!!
ముప్పయి జిల్లాల్లో జరిగిన పోలింగ్లో ఎనిమిది జిల్లాల్లో మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. జగిత్యాల జిల్లాలో పురుషులకన్నా మహిళలు 19.64 శాతం అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుషులు 69.84 శాతం ఓటు వేయగా స్త్రీలు 89.48 శాతం వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11.81 శాతం, నిర్మల్ జిల్లాలో 9.7 శాతం అధికంగా ఓటువేశారు. కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లోనూ స్త్రీలే ముందు వరుసలో ఉన్నారు.