కెసిఆర్పై సదానంద వ్యాఖ్యలు అలాగేనా, పట్టదంటే ఎలా: వినోద్
న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ధర్నా చేస్తారనే వార్తలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ తప్పు పట్టారు. ధర్నా చేసుకుంటే చేసుకోనీయనే పద్ధతిలో కెసిఆర్పై సదానంద చేసిన వ్యాఖ్యలు సరి కాదని ఆయన అన్నారు.
సదానంద గౌడతో భేటీ తర్వాత ఇతర తెరాస పార్లమెంటు సభ్యులతో కలిసి వినోద్ కుమార్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పలుమార్లు నిరసన వ్యక్తం చేశామని, జంతర్ మంతర్ ఉన్నదే అందుకని ఆయన అన్నారు.
హైకోర్టు విభజన అంశంతో తమకు సంబంధం లేదని కేంద్రం చెప్పడం దురదృష్టకరమని అన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని ఆయన చెప్పారు. హైకోర్టు విభజన జరగాలని విభజన చట్టంలోని 31 నిబంధన స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు.
తమకు ఎవరితోనూ కయ్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తమ బతుకేదో తాము బతుకుతామని ఆయన అన్నారు. తాము రాజకీయాలు కూడా చేయదలుచుకోలేదని ఆయన అన్నారు. హైకోర్టును రెండుగా విభజించి ఉంటే నియామకాలకు సంబంధించిన సమస్య తలెత్తి ఉండేది కాదని, ఇరు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూర్చుని సమస్యను పరిష్కరించుకుని ఉండేవారని ఆయన అన్నారు. గతంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాల విషయంలో అలాగే జరిగిందని ఆయన చెప్పారు.
ప్రస్తుత సమస్యకు కారణం మీరా, మేమా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విభజన చట్టం విషయంలో అప్పటి యుపిఎ ప్రభుత్వం చిన్న పొరపాటు చేసిందని, హైకోర్టు విభజనకు కాల పరిమితి విధించకపోవడం పొరపాటు అని ఆయన అన్నారు. మోడీకి, సదానందకు చిత్తశుద్ధి ఉంటే ఆ మేరకు చట్టాన్ని సవరించాలని, లేదా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ముగ్గురు మాత్రమే ఉన్నారని, ఎపికి చెందినవారు 18 మంది ఉన్నారని ఆయన అన్నారు. హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతోందని అన్నారు.
ఉమ్మడి హైకోర్టు విభజించాల్సిందేనని మరో ఎంపి కె. కేశవరావు అన్నారు. ఎపి న్యాయమూర్తులను తెలంగాణకు పంపించడం సరి కాదని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు మూడు రోజుల్లో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. న్యాయమూర్తులను సస్పెండ్ చేయడం దేశ చరిత్రలోని తొలిసారి అని ఆయన అన్నారు.