వికారాబాద్ జిల్లాలో మూగజీవాలకు వింత వ్యాధి... చర్మంపై రంధ్రాలు.. పశువుల మృత్యువాత...
వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి మూగ జీవాలను బలిగొంటున్నది. అంతుచిక్కని వ్యాధితో పశువులు మృత్యువాత పడుతుండటంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు సైతం ఈ వైరస్ను గుర్తించలేక సరైన చికిత్స అందించలేకపోతున్నారు.
ఈ వ్యాధి సోకిన మూగ జీవాల చర్మంపై చిల్లులు పడినట్లుగా రంధ్రాలు ఏర్పడుతున్నాయి. అవి పెద్దవిగా మారి రక్తస్రావమై పశువులు చనిపోతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకూ 300 పశువులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది కొత్త రోగమా లేక ఏదైనా వైరస్ ప్రభావమా అన్నది అంతుచిక్కట్లేదు. పశువులను కాపాడుకునేందుకు ఎంత ఖర్చు చేసినా లాభం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. వెటర్నరీ వైద్యులను సంప్రదిస్తే గోట్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యాధి ఇలాగే కొనసాగితే మరిన్ని మూగజీవాలు బలైపోతాయని వాపోతున్నారు.
గత అగస్టు నెలలో వనపర్తి జిల్లాలోనూ మూగ జీవాల్లో ఇలాంటి వ్యాధి బయటపడింది. చర్మంపై బొడిపెలు ఏర్పడి క్రమంగా పుండ్లుగా మారి పదుల సంఖ్యలో జీవాలు చనిపోయాయి. ఈ వ్యాధి బారినపడిన పశువుల్లో జ్వరం,నొప్పులు కూడా ఉన్నట్లు గుర్తించారు.అమ్మతల్లి జాతికి చెందిన ఓ రకమైన వైరస్తో ఈ వ్యాధి వస్తుందని పశు సంవర్థక శాఖ అధికారులు చెప్పారు. మొదట ఒడిశా,పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని పశువులకు ఈ వ్యాధి సోకిందని, అక్కడి నుంచి ఖమ్మం, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు వ్యాప్తి చెందిందని చెప్పారు.
ఈ వ్యాధి సోకిన పశువులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వదలవద్దని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైతే దీనికి వ్యాక్సిన్ లేదని యాంటీ బయోటెక్ మందులతో పాటు జ్వరం, నొప్పుల నివారణకు ఇంజెక్షన్స్ వేయించాలని సూచిస్తున్నారు. అలాగే పశువుల పుండ్ల నుంచి గుర్రపు ఈగలు రక్తం పీల్చకుండా దోమ తెరలు వాడాలని చెబుతున్నారు. వేపాకు పొగ ద్వారా పశువుల కొట్టాల్లో కీటకాలు,పురుగులు,దోమల బెడదను నివారించవచ్చునని చెబుతున్నారు.