వంశీతో గొడవ: మాజీ ఎమ్మెల్యే విష్ణు అరెస్టుకు రంగం, అజ్ఞాతంలోకి..!
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే విష్ణు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఎన్ కన్వెన్షన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు వంశీచంద్ రెడ్డి, విష్ణు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు విష్ణును అరెస్టు చేయవచ్చునని చెబుతున్నారు. వంశీ పైన విష్ణు దాడి చేసినట్లుగా ఫుటేజీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
విష్ణు పైన పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. విధుల్లో ఉన్న ఉద్యోగుల పైన దాడి చేసినందుకు ఈ కేసు పెట్టారు. దీంతో విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. ప్రతిగా విష్ణుకు బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు సీసీ ఫుటేజీని చూసి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. విష్ణు బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. కాగా, విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి చేసిన కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా బుధవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 37 మంది సాక్ష్యులను ప్రశ్నించారు.
ఈ నెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా, ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరించారు.
ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం. విష్ణు, వంశీచంద్ రెడ్డి పరస్పర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.
37మంది ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాన్ని మాదాపూర్ పోలీసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు విష్ణు సహా కొంతమంది దాడి చేసినట్లు గుర్తించారు. దాంతో విష్ణుకు నోటీసులు ఇచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి ఆ రోజు పరస్పరం దాడులకు పాల్పడి, సవాళ్లు కూడా విసురుకున్నారు. తన తప్పేమీ లేదని వంశీచంద్ రెడ్డి చెబుతుండగా, తనపై దాడికి పురికొల్పాడని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.