కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ అందాలు.. సందర్శకుల రాకతో ట్రాఫిక్ జామ్..!
నల్గొండ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ సరికొత్త అందాలు సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో సాగర్ జలకళతో తొణికిసలాడుతోంది. ఆ క్రమంలో గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. పైనుంచి కిందకు జాలువారుతున్న నీటి అందాలు చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. అపురూప దృశ్యం చూసి పరవశించిపోతున్నారు.
ఆదివారం నాడు సెలవు దినం కావడంతో చాలామంది పర్యాటకులు నాగార్జున సాగర్కు పోటెత్తారు. దాంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పిల్లర్ పార్క్ నుంచి బస్టాండ్ ఏరియా వరకు ఫుల్లుగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తూ వాహనాల రాకపోకలను క్లియర్ చేస్తున్నారు.
పురుగులు పట్టిన చికెన్.. దర్జాగా అమ్ముతూ.. అధికారులకు అడ్డంగా చిక్కి..!
ఈ నెల 9వ తేదీన నాలుగు గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు కిందకు విడుదల చేయగా.. ఒక్కో గేటు నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొదట 6వ నెంబర్ గేటు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం వరుసగా 7,8,9 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు వదిలారు. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. 9వ తేదీ నాటికి అది 880 అడుగులకు చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి కాస్తా ముందుగానే జలాశయం నిండిందని అధికారులు తెలిపారు. ఆ మరునాడే మరో 6 గేట్లు ఎత్తి మొత్తం 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.