టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన దళిత నేత : ఆయన లేవనెత్తిన ప్రశ్నలేంటో తెలుసా ?
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి గడ్డం వివేకానంద రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవీకి రిజైన్ చేసిన .. వివేక్ తాజాగా టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీటీ బలోపేతం కోసం పనిచేశానని లేఖలో ప్రస్తావించారు. కానీ చివరి క్షణంలో తన పేరును తప్పించి, మరొకరికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందునే టికెట్ ఇవ్వలేదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం కీ రోల్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తాను, తండ్రి వెంకటస్వామి కీలక పాత్ర పోషించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీకి చెప్పామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడామని, కాంగ్రెస్ పెద్దల వద్ద రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు తనను కోరాలేదా ? అని ప్రశ్నించారాయన.
కూతురి పెళ్లి ముందు అరెస్టయ్యా ?
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే సమయంలో తన కూతురి పెళ్లికి మూడురోజుల ముందు అరెస్టయ్యాయని చెప్పారు వివేక్. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ .. తమను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తమ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఆవిర్భవిందా ? లేదా కేసీఆర్ అండ్ టీం వల్ల ఏర్పడిందా అని ప్రశ్నించారాయన.
టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 10 మంది ఎంపీలు
తెలంగాణ కోసం పోరాడనంటోన్న కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ ఉన్నది ఎంపీలు ఎంతమంది అని ప్రశ్నించారు. కేవలం ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాగా, 10 మంది కాంగ్రెస్ ఎంపీలం స్వపక్షంలోనే విపక్షంలాగా మారి పోరాడామని గుర్తుచేశారు.
ట్యాంక్బండ్పై వెంకటస్వామి విగ్రహాం ఏదీ ?
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన తండ్రి వెంకటస్వామి విగ్రహాం ట్యాంక్బండ్పై ఏర్పాటుచేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఆ మాటను విస్మరించారని మండిపడ్డారు.
ఆపత్కాలంలో అండగా ఉంటే .. ప్రతిఫలం ఇదా ?
సీఎం కేసీఆర్ వెంట ఆపత్కాలంలో అండగా ఉన్నానని పేర్కొన్నారు వివేక్. కానీ చివరి క్షణంలో ఎంపీ టికెట్ అభ్యర్థిత్వాన్ని మార్చి, తగిన ప్రతిఫలం ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ కోసం కష్టపడ్డవారికి టికెట్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మరచారని దుయ్యబట్టారు.