గొంతు నాదే, కెటిఆర్- ఆయన డ్రైవర్ సంగతేమిటి?: మత్తయ్య
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్య రికార్డుల్లో ఉంది తన గొంతేనని అంగీకరించారు. మరి, తెలంగాణ మంత్రి కెటి రామారావు, ఆయన డ్రైవర్ తనను బెదిరించిన రికార్డుల సంగతేమిటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ ఇచ్చిన స్వరపరీక్షల నివేదికపై ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన మధ్యవర్తి జెరూసలెం మత్తయ్య సోమవారం స్పందించారు.
ఓటుకు నోటు కేసులో ఫోన్లో మాట్లాడింది తానేనని, ఆ గొంతు తనదేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కొత్తగా చేప్పేదేముందని ప్రశ్నించారు. 'నా గొంతు గురించి ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పేదేముంది... అది నా గొంతే అని నేనే చెబుతున్నా'నని అంటూ ఫోనులో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీవెన్సన్ను కలసి తాను మాట్లాడానని కూడా చెప్పారు. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన డ్రైవర్ తనను బెదిరించారని, వారి స్వరం కూడా ఫోన్ లో రికార్డయిందని అంటూ మరి వారి సంగతేంటని ప్రశ్నించారు.
ఈ కేసుకు సంబంధించి కుట్ర జరిగిందా? లేదా? అనే విషయం తేలాలని చెప్పారు. ఈ కేసులో తెలంగాణ ఎసిబి తనపై కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. తాను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోకుండా చూశానని చెప్పిన మత్తయ్య తాజాగా ఆ విధంగా మాట్లాడారు.
ఓటుకు నోటు కేసు విచారణకు సంబంధించి ఏ విధమైన వివరాలు తెలియడం లేదని మత్తయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు హ్యారీ సెబాస్టియన్ను కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి రానివ్వడం లేదని ఆయన చెప్పారు.
వాయిస్ శాంపిల్స్కు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక రావడం ఆందోళన కలిగించిందని కూడా చెప్పారు. ఏకంగా ఓ మంత్రే తమను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో విపరీత పరిణామాలు ఎదురైతే ఏం చేయాలో తెలియడం లేదని ఆయన గుంటూరులో అన్నారు.