voice message:గాంధీలో కరోనా రోగుల ఇబ్బందులు, ఫుడ్ కాదు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదట...
గాంధీ ఆస్పత్రి.. తెలంగాణలో కోవిడ్ నోడల్ ఆస్పత్రి. వైరస్ సోకిన వారికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే గాంధీ ఆస్పత్రిలో మాత్రం సరైన వసతులు ఉండటం లేదు. ఈ విషయాన్ని ఇటీవల చనిపోయిన జర్నలిస్టు మనోజ్ వీడియోలో వెల్లడించాడు. వైరస్ సోకిన మరో ముగ్గురిని కూడా గాంధీకి తరలించారు. దీంతో వారు అక్కడ తమకు తినడానికి తిండి లేదు అని వాపోతున్నారు. ఈ మేరకు తన స్నేహితుడితో మాట్లాడిన వాయిస్ మేసేజ్ బయటకొచ్చింది. దీంతో ప్రభుత్వ తీరు మరోసారి బయటపడింది.
ముగ్గురు జర్నలిస్టులు...
ఈటీవీ, 10 టీవీ, ఏబీఎన్కు చెందిన ముగ్గురు జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే తమను పట్టించుకోవడం లేదు అని, మంగళవారం రాత్రి ఫుడ్ ఇవ్వలేదని వాపోయారు. ఇక్కడికి తీసుకొచ్చి.. బెడ్ అది అని చెప్పి వెళ్లిపోయారే తప్ప.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఆ ఆడియో వింటే గాంధీలో పరిస్థితి అద్దం పడుతోంది. ఆ వీడియోను మీరే వినండి.
మంచినీళ్లు కూడా లేవు...
నిన్న వస్తే ఇప్పటివరకు తమను పట్టించుకోవడం లేదు అని వ్యక్తి వాపోయారు. అన్నం కాదు కదా.. కనీసం ఛాయ్ కూడా ఇవ్వలేదు అని చెప్పారు. ఆరో ప్లోర్లో తీసుకొచ్చి పడేశారే తప్ప.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. తమతో తీసుకొచ్చిన బిస్కట్ ప్యాకెట్ తిని, నీళ్లు తాగి ఉన్నామని పేర్కొన్నారు. వార్డులో 15 మంది వరకు ఉన్నామని.. మూడు వాష్ రూములు ఉన్నాయని తెలిపారు.
స్నేహితుడి భరోసా
ఆకలితో ఎలా ఉండాలని ఆయన వాపోయాడు. దీనిపై సూపరింటెండెంట్తో మాట్లాడుతామని చెప్పి.. టెన్షన్ పడోద్దని భరోసానిచ్చాడు మరో వ్యక్తి. కానీ తాము ఏదైనా తింటే..రోగ నిరోధక శక్తి పెంచుకుంటాం.. కానీ ఇలా తమకు ఆహారం ఇవ్వకుంటే ఏం చేయాలని వాపోయాడు.
Recommended Video
నో ట్యాబ్లెట్
ఇక డాక్టర్లు కాదు కదా.. కనీసం నర్సులు కూడా రాలేదని వివరించాడు. ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు అని గుర్తుచేశాడు. ఆహారం కోసం డోర్ కొట్టి మరీ అడిగితే.. ఆ ఇస్తాం అంటూ చెబుతున్నారే తప్ప ఇవ్వడం లేదన్నారు. టాయిలెట్ల వద్దకు ఇంకా పారిశుద్ద్య సిబ్బంది రాలేదు అని.. కానీ బయట క్లీన్ చేస్తున్నారని పేర్కొన్నారు. రోగులకు తినడానికి ఏమీ ఇవ్వకపోతే ఎలా అని, తమ రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకుంటామని వారు ఆందోళన చెందుతున్నారు.