కేటీఆర్ ఆ మాటలేమిటీ?: గ్రేటర్ ప్రచారంలో మంత్రి పరిటాల సునీత
హైదరాబాద్: టీఆర్ఎస్ బెదిరింపులకు ఎవరూ భయపడరని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పరిటాల సునీత శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్లో తాము గెస్ట్లమని వ్యాఖ్యానించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని అదోగతిపాలు చేశాయని ఆమె మండిపడ్డారు. మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఐదు నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు.
ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆయన నివాసంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార విధాంనపై అధినేతతో చర్చించారు. రెండు రోజుల నుంచి నగరంలో తమ పార్టీ ప్రచారం ఊపందుకుందని, ప్రజల నుంచి కూడా స్పందన బాగానే వస్తోందని చంద్రబాబుకు నేతలు వివరించారు.
కాగా, శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సనతనగర్ నియోజకవర్గంలోని పాటిగడ్డ బసవతారకమ్మనగర్ చౌరస్తా వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మినిస్టర్ రోడ్, కిమ్స్ ఆసుపత్రి, రాణిగంజ్ చౌరస్తా, ఎంజీరోడ్, కవాడిగూడ, ముషీరాబాద్ క్రాస్రోడ్, గాంధీ ఆసుపత్రి, బోయగూడ, చిలకలగూడ చౌరస్తా మీదుగా రోడ్షో నిర్వహిస్తారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని తార్నాక ప్లైఓవర్ బ్రిడ్జి, హబ్సిగూడ, కాకతీయనగర్ కాలనీలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. రాత్రికి రోడ్ నెం 1, ఉప్పల్ స్టేడియం, నాగోల్ క్రాస్ రోడ్ మీదుగా రోడ్షో నిర్వహించి, ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు.