‘ఓటుకు నోటు’కేసులో మరో మలుపు, అప్రూవర్గా మారతానంటూ సుప్రీంకోర్టుకు మత్తయ్య లేఖ!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు కేసు' మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ4గా ఉన్న నిందితుడు, టీడీపీకి సన్నిహితంగా ఉండే జెరూసలెం మత్తయ్య.. తాను అప్రూవర్గా మారేందుకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు.
ఈ ఓటుకు నోటు కేసు గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నాటిది. అప్పట్లో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ రూ.5 కోట్లు ఆఫర్ చేయడం, అందులో భాగంగా అప్పటి టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడడం తెలిసిందే.
అలాగే ఫోన్ సంభాషణల్లో కూడా ఏపీ సీఎం చంద్రబాబు సైతంగా అడ్డంగా బుక్కయ్యారు. 'మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. గో ఏ హెడ్..' అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో బయట పడి ప్రకంపనలు రేపడం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మరో అయిదు రోజుల్లో ఇది విచారణకు రానున్న నేపథ్యంలో జెరూసలెం మత్తయ్య యూటర్న్ తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
ఓటుకు నోటు కేసుతో తనకసలు సంబంధమే లేదని, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ని తాను క్రైస్తవుల సమస్యలపై చర్చించేందుకే కలిశానని జరూసలెం మత్తయ్య ఆా లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, టీడీపీ, టీఆర్ఎస్లు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, తనను హతమారుస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనైతిక చర్యలకు పాల్పడ్డాయని, వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తనను మట్టుబెట్టేందుకు కూడా యత్నిస్తున్నాయని మత్తయ్య ఆ లేఖలో ఆరోపించారు.
''కేసు హైకోర్టులో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సహకరించింది. ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో నాకెవరూ సమచారం కూడా ఇవ్వడం లేదు. అందుకే నేను పార్టీ ఇన్ పర్సన్గా అప్పియర్ అవుతానని పిటిషన్ వేశాను. నాకు తెలిసిన విషయం మొత్తం కోర్టుకు చెబుతాను. ఓటుకు నోటు కేసుతో పాటు ఇందుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి. రెండు కేసుల్లోని రహస్యాలను సీబీఐ వెలికితీయాలి..'' అంటూ మత్తయ్య సుప్రీంకోర్టు సీజేకు విజ్ఞప్తి చేశారు.