ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్.. కానీ పూర్తి స్థాయి అంచనాలు..!? మొత్తం 2లక్షల కోట్ల బడ్జెట్..!!
హైదరాబాద్: తెలంగాణ రష్ట్ర శాసన సభ సమావేశాలకు సమయం కుదిరిపట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. 2018-19లో 1.74 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఈసారి దానికి 15 శాతం అదనంగా పెంచనున్నట్లు సమాచారం. రైతుబంధు పథకానికి నగదు సాయాన్ని 10 వేల రూపాయలకు పెంచనుండటంతో అందుకనుగుణంగా బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల వరకు కేటాయించబోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద 12 వేల కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇక నీటి పారుదల శాఖకు 26 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించే అవకాశముంది. ఆసరా పెన్షన్ల బడ్జెట్ను 12 వేల కోట్ల రూపాయలకు పెంచే అవకాశాలున్నాయి. రైతురుణమాఫీకి 20 వేల కోట్ల రూపాయలు కేటాయించే సూచనలున్నాయి. విద్య, వైద్యం, సంక్షేమం వంటి శాఖలకు ఎప్పటిలాగే కొంత పెంపుతో కేటాయింపులు జరపనున్నారు. ఇవన్నీ కలిపి బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని సమాచారం. ఈసారి ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నప్పటికీ, బడ్జెట్ స్వరూపం మాత్రం పూర్తిస్థాయిలో ఉంటుంది. కాకపోతే.. పరిమిత కాలానికి నిధులను వ్యయం చేసేలా శాసనసభ అనుమతి పొందనున్నారు.