జిహెచ్ఎంసిలో 6.35 లక్షల మంది ఓటర్లను తొలగించాం: భన్వర్లాల్
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) పరిధిలో 6.35 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ చెప్పారు. ఇప్పటి వరకు 19 లక్షల మందికి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటర్లు తమ ఓటర్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని భన్వర్ లాల్ తెలిపారు. నియోజకవర్గం మారిన ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 31లోగా ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. వచ్చే జనవరి 11న కొత్త ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు.
జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటరు కార్డులు జారీ చేస్తామన్నారు. ఎల్లుండి నుంచి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేపడుతామని చెప్పారు. అర్హులైనవారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు పోలింగ్ బూత్ల్లో ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు.
చనిపోయిన, డుప్లకేట్, తరలిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. అర్హులైనవారి పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు చూపిస్తే అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.