వీఆర్వో వ్యవస్థ రద్దు..? మరోసారి తెరపైకి అంశం, బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
మరోసారి తెరపైకి వీఆర్వో వ్యవస్థ అంశం వచ్చింది. వాస్తవానికి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ఆడపా దడపా చెబుతూ వస్తోన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీ వేయగా.. వీఆర్వోలు ఉండాల్సిందేనని తెలిపింది. కమిటీ సూచనల మేరకు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి వీఆర్వో వ్యవస్థ రద్దు గురించి కామెంట్ చేయడం చర్చకు దారితీసింది.
ఏపీలో త్వరలో 3795 వీఆర్వో పోస్టుల భర్తీ- వీఆర్ఏలకు వన్ టైమ్ ఛాన్స్-మార్గదర్శకాలివే....
వీఆర్వోలే కారణం..
పల్లెప్రగతి, నియంత్రిగ సాగు విధానంపై జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పల గ్రామంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్వోల గురించి మంత్రి ప్రస్తావించారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన రెవెన్యూ వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందనేలా మాట్లాడారు. రైతుల పేర్లు భూముల రికార్డుల్లోకి నమోదుకావడంలో జాప్యం జరుగుతోందన్నారు. దీంతో వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందడం లేదు అన్నారు. అందువల్ల ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. దీనికి కారణం వీఆర్వోలు మాత్రమేనన్నారు. అందుకోసమే వ్యవస్థకు రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని పేర్కొన్నారు.
బహిరంగసభలో కామెంట్స్
రఘునందన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా రెవెన్యూశాఖ పునర్ వ్యవస్థీకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి వీఆర్వో వ్యవస్థను రద్దు చేయబోతున్నామని బహిరంగ సభలో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామంలో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి.. వ్యవసాయశాఖ లేదా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేస్తారని జరుగుతోన్న ప్రచారానికి మంత్రి వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి.
Recommended Video
కలెక్టర్ల అభిప్రాయం
వీఆర్వోల గురించి కలెక్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్లోనూ సీఎం కేసీఆర్ వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే వీఆర్వో వ్యవస్థ ప్రక్షాళన చేస్తారా.. లేదంటే రద్దు చేస్తారనే అంశం మరోసారి చర్చకు దారితీసింది. దీనిపై ప్రభుత్వ వర్గాలే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.