వామ్మో ఆర్టీసీ బస్సులు.. ప్రాణాలు తీస్తున్నాయి.. తాత్కాలిక డ్రైవర్లతో పరేషాన్..!
సంగారెడ్డి : ఆర్టీసీ సమ్మె కారణంగా తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు అధికారులు. ఆ క్రమంలో రోడ్డు ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఉన్నతాధికారులు హుటాహుటిన టెంపరరీ సిబ్బందిని డ్రైవర్లు, కండక్టర్లుగా నియమించారు. అయితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు.
సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాలోని సదాశివ నగర్ దగ్గర ఘోరం ప్రమాదం జరిగింది. హైదరాబాద్ 2 డిపోకు చెందిన బస్సు.. టాటా ఏస్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. మృతులు పుల్కల గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. స్పాట్లో ఓ మహిళ, పురుషుడు చనిపోగా, మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు.
ఆర్టీసీ సమ్మె చట్టబద్ధం కాదా.. ఉద్యమంలో మీ జాడేది.. ఆ ముగ్గురు మంత్రులపై రేవంత్ చిందులు..!
అనుభవం లేని డ్రైవర్లు బస్సులు నడిపిస్తుండటంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా.. అనుభవరాహిత్యం వల్ల పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో సోమవారం ఉదయం హైదరాబాద్ కూకట్పల్లిలోని వై జంక్షన్ దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. ముందు వెళుతున్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. అయితే ఓ బస్సు డ్రైవర్ మద్యం సేవించాడనే ఆరోపణలు వినిపించాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రయాణీకుడి కాలుపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటంతో ప్రయాణీకులు భయాందోళన చెందుతున్నారు.