తెలంగాణ ప్రభుత్వంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు వర్షం కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతాయని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను తవ్వించిందని లక్ష్మీనారాయణ తెలిపారు.
వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వడం అభివృద్ధికి కీలకమని అన్నారు. సాగు నీటి రంగం బాగుపడితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని లక్ష్మీనారాయణ తెలిపారు.
వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించనందువల్లే ఏడేళ్ళు ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశానని తెలిపారు. సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తానని, ఇప్పుడు తన రాజకీయ అరంగేట్రంపై జరుగుతున్న ప్రచారం నిజం కాదని చెప్పారు.