గోదావరి బ్రిడ్జిపై ఆటోలో మంటలు, ట్రాఫిక్ జాం: వివిఎస్ లక్ష్మణ్ పుష్కర స్నానం
ఆదిలాబాద్: జిల్లాలోని బాసర గోదావరి వంతెనపై ప్రమాదవశాత్తు ఓ ఆటో దగ్ధమైంది. ఆటోలో కెమికల్స్ తరలిస్తుండగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. మంలు అంటుకుని ఆటో పూర్తిగా దగ్ధమైంది.
దీంతో నిజామాబాద్-బాసర రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. కాగా, ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు ఆర్పేసిన అనంతరం పోలీసులు.. ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ పుష్కర స్నానం
నిజామాబాద్ జిల్లా పోచంపాడ్లో భారత జట్టు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ పుష్కర స్నానం చేశారు. మంగళవారం ఆయన పోచంపాడ్ పుష్కరఘాట్ వద్ద తన సతీమణి, పిల్లలతో కలిసి పుష్కరస్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు గోదావరి పుష్కరాల ప్రాశస్థ్యం వివరించారు.
కాళేశ్వరంలో ప్రత్యేక, వీఐపీ దర్శనాలు రద్దు
కాళేశ్వరం, ధర్మపురిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తుల రద్దీ వలన కాళేశ్వరం, ధర్మపురిలో ప్రత్యేక, వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పుష్కర ఏర్పాట్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: తుమ్మల
భద్రాచలంలో పుష్కర ఘాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం పరిశీలించి, సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ప్రజలకు మాటిచ్చామని, ఆ మాటక కట్టుబడి ఘనంగా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, పుష్కర ఏర్పాట్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.