తప్పదు .. నెలాఖరు వరకూ వేచి ఉండాల్సిందే.. మందు ప్రియుల గుండెల్లో గుబులు రేపిన లాక్ డౌన్ పొడిగింపు..
హైదరాబాద్ : సమయం ఆసన్నమైంది మిత్రమా.. ఇక ఉపేక్షించేది లేదు. దాదాపు మూడు వారాల నుండి కనీసం మద్యం వాసనకు కూడా నోచుకోలేని మందుబాబులు మరొక్క నాలుగు రోజుల్లో తనివి తీరా మద్యం సేవించొచ్చని కలలు కంటున్నారు. కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ ఆంక్షలు ఈ నెల 14తో సడలిపోనుండడంతో, ఆ మరుసటి రోజునుండి తమ మద్యం దాహం తీరబోతున్నట్టు ఎగిరి గంతేసారు. ఇంతలోనే పిడుగులాంటి వార్తతో మందు ప్రియులు దిగాలుపడిపోయినట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ ఆంక్షలు పొడిగింపు.. వామ్మో అంటున్న మద్యం ప్రియులు..
లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో మద్యం షాపులను, రెస్టారెంట్లను పూర్తిగా మూయించివేసింది ప్రభుత్వం. దీంతో మందు ప్రియులు తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లినట్టు కొన్ని సంఘటనలు రుజువు చేసాయి. అంతే కాకుండా మరికొంత మంది మందుబాబులు లాక్ డౌన్ ఆంక్షలను ఎప్పుడు తొలగిస్తారా.. ఏప్రిల్ 15 ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి గుండెలు పగిలిపోయే నిర్ణయాన్ని వెళ్లడించేందుకు రంగం సిద్దం చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
ఏప్రిల్ చివరి వరకూ ఆంక్షలే... ఆగేదెలా మిత్రమా అంటున్న మద్యం బాబులు..
లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని, అందుకు స్వీయ నియంత్రణే సరైన ఆయుధమని యావత్ బారత దేశ ప్రజలు ముక్తకంఠంతో చెప్పుకొస్తున్నారు. మరో రెండు వారాల పాటు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తే కరోనా వైరస్ మీద విజయం సాధించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అందుకోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయంతో పాటు ప్రజల మరోభావాలకనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మానసిక ఒత్తిలో మద్యం బాబులు.. సంయమనం పాటించాలంటున్న ప్రభుత్వాలు..
ఈ నెల 14తో ముగుస్తున్న లాక్ డౌన్ ఆంక్షలను ఏప్రిల్ నెల చివరివరకూ కొనసాగించేదుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో అన్ని వర్గాల ప్రజల నుండి హర్షం, ఆమోదం వ్యక్తం అయినప్పటికీ, ఒక వర్గం నుండి మాత్రం వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. అదే మందు ప్రియుల అంశంలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపు అంశం పంటికింద రాయిలా పరిణమించింది. ఏప్రిల్ 15సమీపిస్తోంది, ఆంక్షలు సడలిపోయి ఫుల్ గా మందు కొట్టొచ్చనుకున్న మందు బాబులు మాత్రం మళ్లీ ఢీలా పడిపోయారు. తమ ఇష్టమైన బ్రాండ్ సరుకును సేవించేందుకు నెలాఖరు వరకూ వేచి చూడాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం... ఢీలా పడిపోయిన మద్యం ప్రియులు..
కరోనా వ్యాధి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. దేశ వ్యాప్తంగా ప్రజల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి స్వచ్చందంగా స్వీయ నియంత్రణ పాటించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని వర్గాల ప్రజలకు కొత్త సమస్యలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. కాని కొన్ని అలవాట్ల పట్ల సంయమనం పాటించి ప్రభుత్వాలకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాలు పలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. ముఖ్యంగా తరుచూ మద్యం సేవించే మందు ప్రియులు విజ్ఞతగా వ్యవహరించాలని, అందుకోసం ఓ నెల రోజులు సహనంతో వ్యవహరించాలని వేడుకున్నాయి. కాగా ప్రభుత్వ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన మందు బాబులు ఈ ఆంక్షల పొడిగింపు పట్ల కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందు మద్యం ప్రియులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు మిత్రమా అనే భావం వ్యక్తం అవుతోంది.