తెలుగు రాష్ట్రాల్లో మొదటిది: హైదరాబాద్ మెట్రో కోసం మెగా ఫ్యామిలీ హీరో వెయిటింగ్
మెట్రో రైలు కోసం భాగ్యనగర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం వచ్చేసింది. ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: మెట్రో రైలు కోసం భాగ్యనగర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం వచ్చేసింది. ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించనున్నారు. మెట్రో రైలు కోసం సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వెయిట్ చేస్తున్నారు.
అదిరిపోయే మెట్రో ఛార్జీలు, 200% ఎక్కువ: అక్కడే మతలబు, ఎక్కడ ఎలా ఉన్నాయంటే?
అందుకు ప్రముఖ నటుడు అల్లు శిరీష్ వ్యాఖ్యలే నిదర్శనం. హైదరాబాద్ మెట్రో కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని అతను అన్నాడు. తనకు మెట్రో రైళ్లు అంటే చాలా ఇష్టమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెట్రో రైళ్లలో ప్రయాణించానని, ఇప్పుడు హైదరాబాద్ రైలులో ఎప్పుడు ఎక్కుతానా అని ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు.
Recommended Video
హైదరాబాద్ మెట్రో ఎక్కేందుకు అల్లు శిరీష్ తహతహ
'ఐ లవ్ మెట్రో రైడ్స్. ప్రపంచంలోని ఎన్నో మెట్రో రైళ్లలోప్రయాణించాను. భారత్లోని మెట్రో రైళ్లలోనూ ప్రయాణించాను. ఇక హైదరాబాద్ మెట్రో కోసం ఎదురుచూస్తున్నాను. ఇది నేను 2016లో బెంగళూరు మెట్రో స్టేషన్లో దిగిన ఫొటో' అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.
30 కిలోమీటర్ల పొడవున పూర్తయింది
హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్ నుంచి నాగోలు వరకు 30 కిలోమీటర్ల పొడవును అందుబాటులోకి రానుంది. మెట్రో నిర్మాణం కోసం 2008 నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తొలుత మెటాస్తో ఒప్పందం కుదిరింది. నాటి ప్రభుత్వం దానిని రద్దు చేసి, 2010లో ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యంతో ఎల్ అండ్ టీకి అప్పగించారు. 2012 జులై నుంచి 66 కి.మీ. పొడవున పనులు మొదలయ్యాయి.
జాతికి అంకితం
నాగోలు నుంచి మియాపూర్ వరకు 30 కి.మీ. పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో మెట్రో రైలును సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రధాని మోడీ సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు జాతికి అంకితం చేస్తున్నారు. బుధవారం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి రోజూ మెట్రో ఈ కారిడార్లో తిరగనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో తొలి మెట్రో
మెట్రో రైలు ప్రారంభమైతే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. ఏసీలో ప్రయాణం, చాలా త్వరగా అనుకున్న గమ్యానికి చేరవచ్చు. ఇతర నగరాలలో ఉన్నట్లే మెట్రో ధరలు ఉన్నాయి. కానీ తొలుత ప్రచారం జరిగిన దానికి, ఇప్పుడు ఉన్న రేటుకు ఎంతో తేడా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో తొలి మెట్రో కావడంతో హైదరాబాద్ వచ్చే వారంతా మెట్రో ఎక్కేందుకు ఇష్టపడతారని భావిస్తున్నారు.
మూడు కోచ్లు, 330 మంది
మెట్రో రైలులో మూడు కోచ్లు ఉంటాయి. ఒక్కో కోచ్లో 330 మంది చొప్పున 1000 మంది ప్రయాణించవచ్చు. మెట్రోలో అనౌన్స్మెంటుతో పాటు కోచ్లలో ఉండే టీవీల్లోని మానిటర్లలో రాబోయే స్టేషన్ల సమాచారం కొద్ది నిమిషాల ముందే తెలుస్తుంది. దీని వల్ల ప్రయాణీకులు దిగే స్టేషన్ విషయంలో గందరగోళం ఉండదు. కొద్ది రోజులు 15 నిమిషాలకు ఓ రైలు నడుపుతారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పు ఉంటుంది.