WAKE UP:ఆర్టీసీతో ఆగిపోదు, సింగరేణి, భూములు, నీరు కూడా విక్రయిస్తారు: భట్టి
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ అనడం సరికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై పిలిచి మాట్లాడాల్సింది పోయి డెడ్లైన్ విధించడం సరికాదన్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల నేతలు మేల్కొవాలని కోరారు. ప్లీజ్ వెకప్ అంటూ పిలుపునిచ్చారు.
డెడ్లైన్ ఎందుకు?
కార్మికులకు డెడ్లైన్ విధించడం సరికాదని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాటి మీడియా సమావేశంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామనే సంకేతాలను కేసీఆర్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇది ఒక ఆర్టీసీతోనే పోదని.. హైదరాబాద్లో ఉన్న విలువైన భూములు కూడా అమ్మకానికి పెడతారని చెప్పారు. తమ ముందుతరం ఇచ్చిన విలువైన ఆస్తులను కాపాడుకోవాల్సింది పోయి.. విక్రయించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
నెక్ట్స్ సింగరేణి..?
సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేస్తామని భట్టి విక్రమార్క్ ఆందోళన వ్యకం చేశారు. చివరికి ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఉద్యోగాలను కూడా అమ్ముతారని భట్టి ఆదోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ఏమీ మిగలదని.. మిగిలిన వాటిని గ్యారంటీ కింద తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దివాళ తీసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు.
ప్లీజ్ వెకప్..
సీఎం కేసీఆర్ చర్యలను మొగ్గలోనే తుంచివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే రాష్ట్రాన్ని తాకట్టు పెడతారని చెప్పారు. ప్రజలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలు, యూనియన్ నేతలు, జేఏసీ మేల్కొవాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే చర్యను అడ్డుకోవాలని కోరారు. ప్లీజ్ వెకప్ అంటూ విక్రమార్క కోరారు. లేదంటే భావితరాలకు ఆస్తులేమీ ఉండబోవని హెచ్చరించారు.
ప్రజల సమస్య
ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై విసృతంగా చర్చ జరగాలని భట్టి అభిప్రాయపడ్డారు. ఏ కొంచె నిరాసక్తత, అశ్రద్ధ వహించిన రాష్ట్రం మిగలదన్నారు. ఇది ఒక్క కార్మికుల సమస్య కాదని.. ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.ఎక్కడైనా ప్రైవేట్ సంస్థలు లాభాపేక్షతోనే పనిచేస్తాయని భట్టి విక్రమార్క చెప్పారు. సీఎం కేసీఆర్ ప్యూడలిస్ట్, క్యాపిటలిస్ట్ అని విమర్శించారు.
జర్నలిస్టులకు బెదిరింపులా..
మీడియా సమావేశంలో ప్రతినిధులపై విరుచుకుపడటం సరికాదన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని నిలదీశారు. సీఎంను మీడియా ప్రతినిధులు ప్రశ్నించకూడదా అని అడిగారు. తెలగాణ ఏర్పడే సమయంలో మిగుల బడ్జెట్ కాస్త అప్పులకుప్పగా మారిందని చెప్పారు. కార్మికుల డిమాండ్ల తీర్చడానికి భేషజాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారణమని స్పష్టంచేశారు. సమ్మె, కార్మికులపై మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడి నెపాన్ని విపక్షాలపై వేస్తున్నారని దుయ్యబట్టారు.