ఆ విషయం నాకు తెలియదు: కోదండరాం, కీలక బాధ్యతలు, కూటమిలో లుకలుకలు
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం శుక్రవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కలిసి వచ్చే శక్తులతో ముందుకు సాగడానికే కూటమి అని చెప్పారు. వీలైనంత త్వరగా కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటు చేయాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు.
సాధ్యమైనంత త్వరగా కూటమి ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు. కూటమి ఏర్పాటులో కాలయాపన నష్టమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి ఏర్పాటుపై చర్చించానని చెప్పారు. ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని కోరానన్నారు. కలిసి వచ్చే శక్తులతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ కూడా చెప్పారన్నారు.
సీట్ల పంపకాలు, కూటమి ఏర్పాటు వేర్వేరు
కూటమి ఏర్పాటు ఆలస్యమైతే అన్ని పార్టీలకు నష్టం జరిగే అవకాశముందనే విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పానని కోదండరాం అన్నారు. కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆయన సూచించారని చెప్పారు. తాము 17 సీట్లు అడిగామని, 15 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. కూటమి ఏర్పాటు, సీట్ల పంపకాలు వేర్వేరు అంశాలన్నారు.
తమకు 25 చోట్ల బలం
పార్టీ నిర్మాణం లేకుండా తాము సీట్లు కోరడం లేదని చెప్పారు. తాము ధీమాగా ఉన్న స్థానాలనే కోరుతున్నామని అన్నారు. సుమారు 25 చోట్ల తాము బలంగా ఉన్నామని చెప్పారు. అధికారమే పరమావధిగా కూటమి అంటే ఎలాంటి లాభం ఉండదని కోదండరాం చెప్పారు. లక్ష్య సాధన కోసం పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన వద్దనుకున్నామని, ఇఫ్పుడు కేసీఆర్ పాలనలో అదే రిపీట్ అయిందని, అలాంటి పాలన విముక్తికి కృషి చేస్తున్నామని చెప్పారు.
ఆ విషయం నాకు తెలియదు
వ్యక్తులు కేంద్రంగా పొత్తులు సరికాదని కోదండరాం చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం అప్రస్తుతం అన్నారు. కూటమిలో సీట్ల సర్దుబాటు తేలిన తర్వాత మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. కాంగ్రెస్ 95, టీడీపీ 14 స్థానాలలో పోటీ విషయమై తనకు తెలియదని చెప్పారు. కాగా, కోదండరాంకు ప్రజా కూటమిలో కనీస ఉమ్మడి ప్రణాళిక వంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఒకటి రెండు రోజుల్లో పొత్తులపై అధికారిక ప్రకటన కూడా రానుంది.
కాంగ్రెస్ అసంబద్ధ లీకులు
కాంగ్రెస్ పార్టీ పైన సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీపీఐ, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ అసంబద్ధమైన లీకులు ఇస్తోందని ఆరోపించారు. కూటమిని రాజకీయ లక్ష్యం కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. కూటమి ఏర్పడి దాదాపు 50 రోజులు అయిందని చెప్పారు. మేము సర్దుబాటు ధోరణితో ఉన్నామని, కాంగ్రెస్ మాత్రం అసంబద్ధ లీకులు ఇస్తోందని మండిప్డడారు.
తప్పుడు ప్రచారం, వెళ్లేది లేదు
కాంగ్రెస్ తీరు పట్ల తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామన్నారు. సీపీఐకి రెండు మూడు సీట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఉందన్నారు. సురవరం అధ్యక్షతన 4వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు అవుతుందని చాడ చెప్పారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎవరో ఏర్పాటు చేసిన ఫ్రంట్కు తాము వెళ్లేది లేదని చెప్పారు.